Monday 10 August 2015

// మా ఇంట్లో ఓ శంకర్ దాదా..//

// మా ఇంట్లో ఓ శంకర్ దాదా..//
                                      - కె.కె. కృష్ణ కుమార్, 05.08.2015

ఎందరో మహానుభావులు అందరికీ వందనము... మా పెద్దోడు శ్రీరాంశరణ్ ఎంబిబిఎస్ చేరాడు.. ఒంగోలు లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో.. వారం రోజుల టెన్షన్.. ఒకరికి కాదు ఇద్దరికి కాదు.. ఇంటిల్లిపాదిదీ ఇదే పరిస్థితి.. కారణం లేకపోలేదు..


మొదట తెలంగాణా కౌన్సిలింగ్ జరిగింది గత నెల 29 న తేదీన. తెలంగాణాలో మావాడు నాన్-లోకల్.. ర్యాంకు 196 మాత్రమే.. ఉస్మానియా వస్తుందనుకున్నాం.. కనీసం గాంధీ మెడికల్ కాలేజ్‌కూడా రాలేదు.. వరంగల్ లో వచ్చింది.. కానీ.. మేము సానుకూలంగాలేక వరంగల్ వద్దనుకున్నాం.. నో-ఆప్షన్ పెట్టేశాం.. ఆ నిర్ణయం తప్పు కావచ్చని ఆ క్షణం మాకు తెలీదు..
ఆం.ప్ర లో లోకల్ ..ర్యాంకేమో 967.. 
ఈరోజున ( ఆగస్టు 5 న)ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిలింగ్ కోసం ఏమౌతుందో తెలీక నానా ఇబ్బందీ పడ్డాం... సీట్ వస్తుందో రాదో అర్ధం కాని పరిస్థితి.. రిజర్వేషన్లు అన్నీ పోగా మిగిలిన వాటిలోనే రావాలని తెలిసి భయపడ్డాం.. లెక్కలు.. వగైరా లతో తల బొప్పి కట్టింది.. ఇక ఎదురుగా కౌంట్‌డౌన్ స్టార్ట్... ఒకొక్క సీటు ఐపోతూ.. భయపెట్టింది కంప్యూటర్ స్క్రీన్ ..
విశాఖ మేము లోనికి వెళ్ళకముందే పూర్తెపోయాయ్.. చూస్తుండగానే గుంటూరు, కాకినాడ, విజయవాడ సీట్లు హుష్ కాకి.. చివరకి గవర్నమెంట్ కాలేజీలో చేరాలన్న సంకల్పంతో ఒంగోలు రింస్ కాలేజీ లో చేరాడు శ్రీరాం..మావంశంలో రెండో డాక్టర్..

మా నాన్నగారి కల.. : మనుమడీని డాక్టర్ గా చూడాలన్నది, మా నాన్నగారు కరణం సుబ్బారావు గారి చిరకాల వాంఛ. ఇక ఆ వేటలో మా శ్రీరాం ఒంటరిగానే పోరాడాడని చెప్పాలి.. కేవలం మేము వాతావరణ కల్పించడం మినహా ఏమీ చేయలేదు.. ఇక ఎంట్రన్స్ సమయంలో .. భావరాజు పద్మిని గారు, వారి శ్రీవారు శ్రీ సతీష్ గారు బెంగులూరులో ఎంట్రన్స్ వ్రాయడానికి వెళ్ళినప్పుడు మాకు గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసి సహకరించారు.. వారికి ఈ సందర్భంలో ప్రత్యేక కృతజ్ఞతలు.. ఇక మాయింటికి రండి అంటూ కొల్లూరు విజయశర్మగారూ, రేఖ గారూ కూడా ఆహ్వానించినా దూరం అవ్వడం వల్ల మేము భావరాజు సతీష్ గారు ఏర్పాటు చేసిన వసతి గృహాన్ని వినియోగించుకున్నాము.. కొల్లూరు విజయా శర్మ గారికి, Naveenrekha Ns మేడం గారికి కృతజ్ఞతలు.. ఇక సీట్ ల వేటలో సహకరించిన మా తమ్ముడి మామగారు శ్రీ ప్రసాద్ గారూ, మా ఫొటోగ్రాఫర్ మిత్రుడు శ్రీ శివరంజని సాయి (చీరాల)అన్నకు, మూర్తి గారు (ఆర్టిసి, ఒంగోలు )వారికి, మా శ్రీరాం స్నేహితుల పేరెంట్స్ అందరికీ పేరుపేరున నా ప్రత్యేక కృతజ్ఞతలు..
ఇక మాఇంట్లో సంబరాలు చేసుకోవాలి.. ఇక్కడ ఎవరి ఫేరైనా చెప్పడం మరచిపోతే తిట్టకండే.. ఆనందంలో మరిచిపోయానని క్షమించేయండే...
ఇక పాటేస్కుంటాం మరి.." శ్రీరాం శరణ్ ఎంబిబిఎస్.. ఊ..హ..ఊ..హ"
శుభసాయంత్రం - మీ కరణం





//తన కోసం...//

//తన కోసం...// 
                                                         _ కె.కె. కృష్ణ కుమార్, 09.08.2015
తను వస్తేనే తనువులు ..మనువాడినంత సంబరపడతాయ్
తను వస్తేనే కనులు.. సుషుప్త రెప్పల దుప్పటి తొలిగిస్తాయ్.
తను వస్తేనే మనసులు .. రెక్కలు తొడిగి రెపరెపలాడతాయ్..

తను వస్తేనే జీవులు.. సాగరన నావల్లే తేలిపోతాయ్..
తను వస్తేనే నేలమ్మ.. నేలమీదమ్మ లేత పాదాల గజ్జెలు ఘల్లు మంటాయ్...
లేత ఆకుల నుంచి ..
లేత కిరణాలు పంచి..
లేత మనసు ను గిలిగింతలెట్టే..
తను వస్తేనే.. 
సర్వం తెల్లారినట్లౌతుంది...
సకలం సాకారమౌతుంది..



Monday 3 August 2015

నిన్న ఇష్టం లేక ఈ రోజు పోస్టా.. !

నిన్న ఇష్టం లేక ఈ రోజు పోస్టా.. !

స్నేహం క్షణభంగురమా..?

నేస్తాలు.. మిత్రులూ.. ఫ్రెండ్స్.. స్నేహితులూ, హితులూ, సన్నిహితులు, అంటు, అనుకూలుడు, అనుగులము, అనుసరుడు, అనుసారకుడు, ఆక్రందుడు, ఆప్తుడు, ఇతవరి, ఇష్టసఖుడు, ఇష్టుడు, ఉద్దికాడు, ఉద్దీడు, చనవరి, చెలికాడు, చెలిమరి, చెలిమికాడు, తోడు, దోస్తు, నంటుకాడు, నందంతుడు, నందివర్ధనుడు, నిజుడు, నెచ్చెలి, నెత్తురుబొత్తు, నెయ్యరి, నెయ్యుడు, నేస్తకాడు, నేస్తము, నేస్తి, పక్కము, పక్షము, పరేతరుడు, పొందు, పొందుకాడు, పొత్తుకాడు, పోటిగాడు, బాసట, బోడిక, భరణ్యువు, మనుకునంటు, మిత్త, మిత్తరుడు, మిత్రము, మిత్రుడు, మైత్రుడు, వయస్యుడు, విధేయజ్ఞుడు, విహితుడు, శ్రేయోభిలాషి, సంగడి, సంగడికాడు, సంగడీడు, సంగాతకాడు, సంగాతి, సకుడు, సఖుడు, సగంధుడు, సచి, సచివుడు, సజుఘుడు, సమ్మోదికుడు, సవయస్కుడు, సహచరుడు, సహభావి, సహవాసి, సహాయుడు, సుహృత్తు, సుహృదయుడు, సుహృదుడు, స్నిగ్ధుడు, స్నేహి, స్నేహువు, స్వకుడు, హితవరి, హితుడు.............................................................. 

   ...... వంటి ఎన్నో పర్యాయపాదాలున్నాయి కదా.. మరి స్నేహమంటే శాశ్వతం, కలకాలం.. నిత్యం.. చివరికంటా,.. నీడగా.. కట్టెకాలేవరకురా, అని అనే వారు స్నేహితులంటున్నాము కదా.. !

ముఖపుస్తక మిత్రులందరూ.. కట్టె కాలే వరకూ మిత్రులుగా ఉంటారంటారా..? నాకెందుకో స్నేహం అనే దానికి అర్ధం సరిగా లేదేమో అనిపిస్తోంది..

 కష్టమొచ్చినా.. నష్టమొచ్చినా వీడిపోనిదీ ఫ్రెండు ఒక్కడే.. అద్దెంటే లేనే లేనిది ఫ్రెండ్ షిప్ ఒక్కటే.. పాట అత్యద్భుతం.. నిజం నేను అలాగే ఉంటుందని గతంలో తలిచేవాడిని నాకు లేని నేస్తాల కోసం.. అర్రులు చాచేవాడిని.. మరి ... తుమ్మితే ఊడిపోయే స్నేహాలకు మరేదైనా పేరుంటే బాగుండు.. ఎందుకంటే ముఖపుస్తక ఫ్రెండ్స్ ఎవ్వరూ కలకాలం కలిసి ఉండే అవకాశం మాత్రం కనపడటం లేదు నాకు మాత్రం.. మరి మీరేమంటారో తెలుపండి.. ముఖపుస్తక స్నేహితులూ.. మీకూ అనుభవంలోకి వచ్చి ఉండవచ్చు.. ఆ అనుభవాన్ని కూడా పంచుకుంటే బావుంటుందని నా అభిలాష..- మీ కరణం..

Sunday 26 July 2015

//మరణ శాసనం రావాలి//



//మరణ శాసనం రావాలి//
                  - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                        26.07.2015

నిర్దయ..నిర్దయ
నిస్సిగ్గు..నిస్సిగ్గు
నిర్లజ్జ..నిర్లజ్జ
నిస్సంకోచంగా..
నిరాటంకంగా..
నిన్నొకటి నేడొకటి రేపొకటి  


ఎత్తుకొని పెంచినోళ్ళు, బిడ్డలు
ఎత్తు ఎదగాలని ఆశపడితే
అడియాస వెంటాడి
కన్నీటి కడలి మిగిలాక..
ఆశలన్నీ ఆవిరై వెక్కిరించాక..
కన్నబిడ్డే శవమై కాటికేగాకా..






ఎందుకా నిర్భయ
తలవంచుకుని వివస్త్రగా..
ఎందుకా కాపాడలేని ఖాకీ
ఉప్పుచారలతో ఊరేగడానికి
ఎందుకా చట్టాల కాగితాలు
పొత్తిగుడ్డల ప్రతిరూపాలుగా
ఎందుకా  నాయకశిఖామణులు
మొసలి కన్నీరు కార్చడానికి..
ఎందుకా అధికారులు
ఎందుకా అధ్యాపకగణాలు
ఎందుకు..ఎందుకు
ఎందుకు ..ఎందుకు



ఏమిటా ధైర్యం
ఎందుకా ద్రోహం
ఎందుకా మలినం
ఎంతవరకూ .. 
ఎందుకొరకూ...
తపన తపన
ఆరాటం..ఆరాటం
మనిషిగా బ్రతికేందుకు లేని తపన
మనుషుల మధ్య బ్రతికేందుకు లేని ఆరాటం

మనిషిలోని మనిషి చచ్చి
మనిషిలోనే మహిషి పుట్టి
నేలమీద నరకానికి ఆనవాళ్ళై..
రాత రాసే విధాతనే దారి మళ్ళిస్తూ..
ఎందుకురా బ్రతకటం...దండగ
రెండు కాళ్ళ మధ్య శవంగా చిక్కి చావక..

ప్రకృతి వైపరీత్యాలు.. 
వస్తుంటాయ్.. పోతుంటాయ్
మీలాంటి నికృష్టులను 
వెర్రి సన్నాసులను
వాజమ్మలను 
మదపిచ్చి మృగాలను
తమతో తీసెకెళ్ళటానికి
వాటికీ భయమే..!

ప్రమాదాలు రోజూ
ఎందరినో మింగేస్తుంటాయ్
రాక్షస జాతికి ఆనవాళ్ళు..
ప్రకృతి కి బద్ధవిరోధులైన
మీ జోలికి రావెందుకో..
మీతో సహవాసానికి
వాటికీ గుండెదడే.....




ప్రతి చావుకేక  మరణ శాసనం కావాలి
చావుకు ప్రతిచావు దండన రావాలి
అప్పటిదాకా ఆగరు ఈ మదపు ఆంబోతులు..
కన్న తల్లిదండ్రుల పాలిట శాపాలు..
కలకంఠి పాలిట మృత్యు శకలాలు

ప్రతి చావుకేక  ఒక ఉరి కంబం కావాలి
అప్పటిదాకా ఆగవు ఆడవారి మరణాలు
అప్పటిదాకా ఆగవు ఎగసిపడే కన్నీళ్ళు..
అప్పటిదాకా ఉండదు.. ఉండదు
నింగికెగసిన కపోతాలకు ఆత్మశాంతి

( కలచి వేసిన నాగార్జున విశ్వవిద్యాలయ విద్యార్ధిని చి.రిషికేశ్వరి ఆత్మహత్య సందర్భంలో.. )
                                     

Thursday 23 July 2015

బేతాళ విక్రమార్క కహాని

బేతాళ విక్రమార్క కహాని
          - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్, చీరాల. , 16.12.2014

//స్వాతి చినుకు//

     మర్రిచెట్టు పైకి ఎక్కి చెట్టుకు వేలాడుతున్న  శవం  విడిపించి  విడిపించి భుజాన్ని  బేతాళుడిని విడిపించి భుజానికెత్తుకుని క్రిందకి దిగి నడవడం ప్రారంభించాడు విక్రమార్కుడు. మౌనంగా వడివడిగా అడుగులేస్తూ చెమట తుడుచుకుంటూ భుజంపై శవాన్ని సరిచేసుకుంటూ వెళ్తున్న విక్రమార్కుడిని పలుకరించాడు శవంలోని భేతాళుడు.

  " రాజా మీరు పడుతున్న శ్రమ చూస్తే జాలి వేస్తోంది. మీకు శ్రమ తెలియకుండా ఒక అందమైన కథ చెబుతాను విను" అంటూ కథ చెప్పడం ప్రారంభించాడు.
_________________________________________________________________________________________________
 
"""అన్నా..! అన్నా...! నిన్నే..నిన్నే.." యోగేశ్వర్ రమణమూర్తిని పిలుస్తున్నాడు..""

 సైకిల్ తొక్కుతూ వెళ్తున్న రమణ ఆగి యోగీశ్వర్ కేసి చూసి ఏంటి కథ అంటూ కళ్ళెగరేశాడు. " అన్న నీతో ఒక విషయం చెప్పలి కొద్దిగా సీక్రెట్? అంటూ సాగదీశాడు.. సైకిల్ దిగి వాడివైపు నడిచాడు. ప్రక్కకు వెళ్ళిన వెంటనే ఒక ఫొటోకాపీ (జీరాక్స్) ఇచ్చి చదువన్నా అన్నాడు.

 అది చదువుతున్న రమణమూర్తి ఫేస్ లో రంగులు మారుతున్నాయ్.. చదవడం అయిపోగానే ఏంది యోగీ ఇది ఎవరీ స్వాతీ..ఎవరీ జిష్ణు .
యోగేశ్వర్ చాలా రోజుల నుంచి తెలుసు, పలకరిస్తునో, నమస్తే పెడుతూనో, నవ్వుతూనో,  రమణమూర్తికి కనబడుతూ ఉంటాడు.

  " అది సరే ఇప్పుడింతకీ ఈ ఉత్తరం నాకిప్పుడెందుకు చూపించావ్ "అడిగాడు రమణమూర్తి.

"అన్నా ఏముందన్నా.. ఆ జిష్ణు ది మీ ఊరే..!  కాస్త గలతీ గాడిలా ఉన్నాడు.. ఆ స్వాతీ మా వూరమ్మయి.. మీ చెల్లెలు క్లాస్ మేట్.." అంటూ చెప్పగానే గుర్తుకొచ్చింది. ఎప్పుడూ గలగల నవ్వూతూ స్వచ్చంగా కనిపించే ఆ అమ్మాయే వ్రాసిందా?? అనుమానంగా అడిగాడు రమణమూర్తి.

 " అవునంటన్న.. చాలా రోజులుగా చక్కగా మాట్లాడే ఆ స్వాతి  అకస్మాత్తుగా మాట్లాడటం మానేసిందట. స్వాతీ వ్రాసిన ఈ లవ్ లెటర్స్ ని వాడు కాలేజీలోని అబ్బాయిలకీ, అమ్మయిలకీ జిరాక్స్ తీసి పంచుతున్నడు.. ఆ విషయం ఆమెకు నేను చెబితే,  నేనేదో ఆమెకి లైన్ వేస్తున్నా అనుకుండే ప్రమాదం వుంది.. పోనీ మనకెందుకులే అనుకుంటే  నిజంగా అమె వ్రాసుంటే ఆమె కుటుంబం ఫరువు పోతుంది.. నువ్వైతే ఏమైనా చెయ్యగలవని నీకు చెప్పానన్నా!.. ఎవ్వరికీ చెప్పమాకు అని యోగేశ్వర్ జారుకున్నాడు.  నిజమైనదేనా?? మీరేమన్న తయారు చేశారా..?  గట్టిగా గదిమాడు రమణమూర్తి. యోగేశ్వర్ మాట్లాడిన తీరు తెన్ను చూసి చెబుతోంది నిజమే స్వార్ధ రహితం అని నమ్మాడు. అయినా తానేమి చేయాలో బోధపడక ఆలోచిస్తూ, మనకు మాత్రం సైకిల్ తొక్కుతూ వెళ్తున్నాడు.




అప్పటి దాకా వీళ్ళిద్దారి సంభాషణను దూరం నుంచి చూస్తున్న స్వాతి బంధువొకామె స్వాతీని నిలదీయడంతో ఆ పిల్లోడు నన్నేడిపిస్తున్నాడు.. నోటీకొచ్చినట్లు మాట్లాడుతుంటే చీవాట్లు పెట్టీ వస్తున్నా అంటూ గడుసుగా, నమ్మకంగా అన్నగురించి అర్ధాలు పెడార్ధాలు తీసి చెప్పీంది.

        స్వాతిని యోగేశ్వర్ ఊరిలోనే అందగత్తెగా చెబుతుంటారు. స్వాతి చినుకు ముత్యపు చిప్పలో ముత్యం ఎంత అందంగా ఉంటుందో..స్వాతి కూడా అంతే అందంగా ఉంటుంది.. అమె చిరునవ్వుకోసం వీథుల్లో కుర్రాళ్ళు అర్రులు జాస్తుంటారు. ఆమెకీ ఆవిషయం పై కాస్త స్పష్టమైన అభిప్రాయం ఉండటంతో కాస్త గర్వం పాలుకూడా అధికమే!.. అయినా స్వాతి ఎదుటి వారిని తన అందాల గర్వంతో  రెచ్చగొడుతుందేమో గానీ ఈ లెటర్ ఏమిటి అంత చండాలంగా వ్రాసింది?? ఆమె వ్రాసిందంటే నమ్మబుద్ధికాక రమణమూర్తి బుర్ర తిరుగుతోంది. నేరుగా చెబుదామంటే ఆమెతో ఎప్పుడూ మాట్లాడలేదు..  పోనీ ఊర్లో వాడని చెప్పిన జిష్ణు ఎవడోకూడా తెలీదు.. ఊర్లో వాళ్ళంతా తెలియాలని లేదు.. మనకెందుకులే అనుకోవడానికా  చెల్లెలి స్నేహితురాలు.. ఏంచేయాలో అర్ధం కావటంలా. చెల్లికి చెప్పడానికీ ఆమె అదే వయసు అమ్మాయి. వాళ్ళ మైండ్ చెడగొట్టగూడదన్న ఉద్దేశ్యంతో సైకిల్ తొక్కుతూ వెళ్తున్నాడు రమణమూర్తి.

  వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు నడుం తిప్పుకుంటూ, పుస్తకాలు చంకనెట్టుకుని ఎదురుగా వస్తూ రమణమూర్తికి కనబడింది స్వాతి. లెటర్ విషయమై  ఆమెని జాగ్రత్తపడమని హెచ్చరిస్తే బాగుంటుందని నిర్ణయానికి వచ్చాడు.

  " స్వాతీ" పిలిచాడు.
" అన్నయా నన్నేనా? అమాయకంగా నటించింది స్వాతి. ఎందుకంటే అక్కడ పిలవడానికి ఎవ్వరూ లేరు తనూ, రమణమూర్తి తప్ప.
" మా ఇంటి నుంచి వస్తున్నావా? "
"అవునన్నయ్యా"
"సరే కాలేజీలో  మగపిల్లలతో కాస్త జాగ్రత్తగా ఉండు స్వాతీ.. " సుతారంగా హెచ్చరించాడు.
"ఏన్నా ఎవడైనా నా గురించి కంప్లైంట్ చేశాడా? ఎవడాడు చెప్పుతో కొడతా" ఇక స్వాతి నోరును ఆపడం తన వల్ల కాదని ముందే గ్రహించిన రమణమూర్తి "నీవు కాలేజ్ లో ఎవరికో లవ్ లెటర్ వ్రాశావుట వాడు వాటిని అందరికీ పంచిపెడుతున్నాడు.. చాలా చండాలంగా ఉన్నయ్ పదాలు జాగ్రత్త. " ఇబ్బందులొస్తాయ్. వాడూ ఉత్త వెధవల్లే ఉన్నాడు అని చెప్పదలుచుకున్నది చెప్పాడు రమణమూర్తి.  ఏ లెటర్ ? ఏముందందులో ఐ మీన్ కంటేంట్" అడిగింది స్వాతి..
"దాన్లో అంతా... "  ... వద్దులే నేను చెప్పలేను గాని చాలా అసభ్యంగా ఉంది.. వాడేమో కాలేజ్ లో పంచేస్తున్నాడట జాగ్రత్త ..అంటూ అక్కడ నుంచి కదిలాడు.  
 ఆమెను ఇబ్బంది పాలుజేయడం ఇష్టం లేని రమణమూర్తి ఆమెకు విషయం చెప్పలేదు.   "వాడు ఉత్త రోగ్ నాగురించి అసత్య ప్రచారాలు ఎక్కువ చేస్తున్నాడు. " అంటూ ఉండిపోయింది స్వాతి.

అప్పటిదాకా వీళ్ళనే గమనిస్తున్న స్వాతీ బంధువు స్వాతి ని నిలదీయటంతో రమణమూర్తి తనని గోల చేస్తున్నాడంటూ బుకాయించింది.. కాదు నమ్మించింది.

 ఇంతకీ ఆ ఉత్తరంలో... " ఏం జిష్ణు నాతో మాట్లాడటం మానేశావ్ .. నువ్ నచ్చలేదన్నావని ఆరోజు నుంచి ఆ డ్రస్ వాడటం లేదు కదా..! నువ్వే ఆ ఫేస్ కి కాస్త పౌడర్ వ్రాయంటే వ్రాసి చావలేదు..ఎందుకో నామీదమోజు తగ్గిందా? ప్రౌఢను తలపించే నా  మేను అందాలు నీకు నచ్చలేదా జిష్ణు  ... " అంటూ ఆ లేఖలో ఉన్న ప్రతి పదం గుర్తొస్తుండగా ..... సైకిల్ తొక్కుతున్న రమణమూర్తి నేరుగా ఎదురుగా వస్తున్న కారునిఢీ కొనబోయి తప్పించుకుని ఇల్లు చేరాడు.

  కొద్దిరోజులు గడిచాయ్..  "ఎవరు చెప్పారు నీకు ?? ఏముందందులో" అని కనపడ్డప్పుడల్ల స్వాతి అడుగుతున్నా ... ఆమె వ్రాసిందని చెప్పబడి సాక్ష్యంగా నిలిచిన ఆ లేఖలోని పదబంధాలు ఆమెకు తన నోటితో చెప్పడానికి ససేమిరా అన్నాడు రమణమూర్తి.

    అంతలో ఒకరోజు బండి మీద ఒక  కుర్రాడితో కలిసి బండి మీద వెళ్తున్న స్వాతిని చూశాడూ రమణమూర్తి. ప్చ్.. మనకెందుకులే అనుకుని నిట్టూర్చి ఇంటికి చేరాడు. రాత్రికి పడుకుని ప్రొద్దుటే లేచే సరికి ఇంటి ముందర బోలెడు మంది జనాలు ఏంమైందని అడిగిన రమణమూర్తి నాన్నతో  “ రమణమూర్తే..., స్వాతీని, జిష్ణు గాడు లేపుకు పోయేలా సహకరించా”డని గోల చేస్తున్నారు. ఇంటికొచ్చిన వాళ్ళలో స్వాతి బంధువుకూడా ఉంది.. ఆమె ఎవరో కూడా రమణమూర్తికి తెలీదు.  వాళ్లకి  సర్ధి చెప్పి , మా అబ్బయితో నేను మాట్లాడతానంటు వాళ్లని పంపించి,  బెల్టు తీసుకున్న రమణమూర్తి నాన్న నిష్టారావు... రమణమూర్తిని నోటికొచ్చినట్లు తిడుతూ బెల్టుకి పని చెప్పాడు. బెల్టు తెగిన తర్వాత "ఏరా.. ఆ అమ్మయితో నీకేం సంబంధం.. ఫోఫో బయటకు పో అంటూ మెడపట్టి బయటకు నెట్టేశాడు. కొడుకుని కనీసం ఏంజరిగిందో అడగాలన్న స్పృహకూడా అప్పుడు నిష్ణారావుకి ఆ క్షణం లేదు.

 ఇప్పుడు రమణరావు పరిస్థితి అగమ్యగోచరం.  వెనుక నుంచి పాట లీలగా వినిపిస్తోంది.. " దేవుడే ఇచ్చాడు వీథి ఒక్కటి .. ఇంక ఊరేల ,సొంత ఇల్లేల ఓ చెల్లెలా..ఏల ఈ స్వార్ధం.. ఏది పరమార్ధం.. .. పాపం పుణ్యం నావి కావే పోవే చిట్టెమ్మా!... నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా.. ఏది నీది.. ఏది నాది.." అంటూ  అంతులేని కథలో పాట రేడియోలో వస్తోంది.


ఇప్పుడు చెప్పు విక్రమార్క మహారాజా.. ఈ కథలో తప్పెవరిది?

మంచి పిల్ల అని అందరు అనుకునే  స్వాతి అందాలు వర్ణిస్తూ ప్రేమలేఖ వ్రాయడమా?
నమ్మకంగా ఉండాల్సిన స్నేహితుడు జిష్ణు.... ఆమె నమ్మకంగా రాసిన లేఖ ను పదుగురికీ పంచడమా?
అనవసరంగా రోడ్డున విషయాన్ని రమణమూర్తికి చేరవేసిన యోగీశ్వర్ దా?
తనకెందుకులే అని ఊరుకోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి , ఎవరు చెప్పారో దాచి పెట్టిన రమణమూర్తిదా?
లేక ఎవరేది చెబితే అది నమ్మి 20 ఏళ్ళు కళ్ళెదుట పెరిగిన కొడుకుని విచక్షణారహితంగా కొట్టి , బయటకు గెంటిన నిష్టారావుదా?

సమాధానం తెలిసీ చెప్పకపోయావో నీ తల వెయ్యి ఒక్కలౌతుంది..ఖబడ్దార్ అంటూ విక్రమార్కుడిని హెచ్చరించాడు శవంలోని  బేతాళుడు.

దానికి విక్రమార్క మహారాజు సమాధానం చెప్పడం ప్రారంభించాడు.

యవ్వనంలో ప్రేమ చిగిరించడం తప్పు కాదు గనుక స్వాతిని తప్పు పట్టలేం . పైగా ఆడపిల్ల మానసికంగా పరిపక్వత రాలేదని అర్ధమౌతోంది కనుక ఆమె తప్పు లేదు.
ఇక యోగేశ్వర్.. అతను చెప్పిన విధానం అమ్మాయిని కాపాడటం కాబట్టి అందులో కనబడుతున్న తప్పు ఏమీ లేదు. ఉంటే ఏదైనా స్వార్ధం ఉందనుకున్నా నువ్ అడిగిన ప్రశ్న ప్రకారం  తప్పు మాత్రం లేదు.

ఇక రమణమూర్తి జాగ్రత్తగా ఉండమని చెప్పాడేకానీ ఆమెని కించపరిచే విధంగాకుడా ఏమీ చెయ్యలేదు.. ఇంకా స్వాతీ నే తప్పుడు సమాచారాన్ని ఆమె బంధువుకు ఇచ్చి ఆపద్దర్మ అబద్దం ఆడింది.

ఇక స్నేహితుడు అనేవాడు రక్షకుడిగా ఉండాలేకానీ భక్షకుడిగా మాత్రం కాదు. కానీ మేకవన్నె పులిలా స్వాతిని ఆమె లేఖలు వ్రాసిందంటూ .. నిజమైన విషయమైనా,  అబద్దమైనా అందరికీ పంచడం మాత్రం జిష్ణు చేసిన భయంకర అపరాధం. ఖచ్చితంగా శిక్షార్హమే..! అంత గలభా చేసిన వాడు మరలా ఆమెను తనవైపు తిప్పుకోవడం లో కృతకృత్యుడైయ్యాడు కాబట్టి  మేకవన్నె పులి అనడంలో తప్పులేదు.

      ఇక రమణమూర్తి తండ్రి...  ఖచ్చితంగా బయట వారు చెప్పింది నోరు తెరుచుకు విన్నాడే కానీ తన అనుకున్న వారు మోసం చేశారని ఆవేశపడ్డాడే గానీ .. కన్నకొడుకు అవ్విధంగా  చేస్తాడని రమణమూర్తి గురించి, కనీసం ఆలోచించకుండా మెడబెట్టినెట్టి నిష్టా రావు తప్పు చేశాడు. ఒకవేళ అతనే తప్పుచేస్తే  నిష్ణారావు పెంపక దోషమౌతుంది .

విక్రమార్క మహారాజా.. ఎంత చక్కగా విశ్లేషించావు.. అందుకే నువ్వు నాకు నచ్చావ్.. నీకు వ్రతభంగం  కలిగింది .. నువ్వు మాట్లాడావ్ ....కాబట్టి ఇక నేనుంటా బైయ్ బైయ్.. అంటూ తుర్రుమని బేతాళుడు శవంతో సహా తిరిగి చెట్టెక్కాడు.  
                              
తనకు మాలిన ధర్మం.. మొదలు చెడ్డ బేరం...- మీ కరణం                 

 అదీ సంగతి .. మరి మీరేవర్ని తప్పుపడతారు ..??
                                      


             


Friday 5 June 2015

" పిచ్చోడు గింజలు విసిరెన్.." (ఓ యదార్ధ గాధకు కథారూపం.)

//" పిచ్చోడు గింజలు విసిరెన్.." (ఓ యదార్ధ గాధకు  కథారూపం.)//

                                                - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్, 28.05.2015

             విజయవాడ వంటి ఒకానొక నగరంలో ఇది జరిగినట్లు.. చిన్నప్పుడు వినట్లు గుర్తు.. అయినా గుర్తున్న విషయాన్ని నా పద్ధతిలో  మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను.. అది వాస్తవమైతే ఆయనకి పాదాభివందనం తెలుపుకుంటూ .. అసలు విషయానికొస్తున్నా..!

 ఓ నగరానికి మేయర్ ఎన్నికలు.. పార్టీలు పోటాపోటీగా సిద్ధమౌతున్నాయ్.. ఓ పెద్దపార్టీ తర్జనభర్జనలు పడి...లెక్కలు బొక్కలు వేసి, తీసివేతలు కూడికలు అనంతరం ఓ అనామకుడిని, రైతు కూలిని తెచ్చి మేయర్ పదవికి నిలబెట్టారు. అనూహ్యంగా అతడు గెలిచాడు.. " ఆ వేలుముద్రేగా మనదే రాజ్యం అని నాయకులు సంబరపడ్డారు..

  మేయర్ హోదాలో కార్పొరేషన్ మెట్లెక్కిన ఆయన అధికార్ల సమావేశం ఏర్పాటు చేశాడు. అతనికి కేటాయించిన అంబాసిడర్ బుగ్గ కారులో ఊరంతా కలియతిరిగాడు.. తర్వాత మరలా అధికారులతో సమావేశమై  అందరినీ పేరుపేరున కుశల ప్రశ్నలేశారు.. అనంతరం తనకి ఒక హెలికాఫ్టర్ కావాలి నగరం చూడాలి.. మనరాజ్యం ఎంతవరకూ విస్తరించి ఉందో తెలుసుకోవాలంటూ ఆదేశించాడు.. ఇదెక్కడి ఖర్మ రెండు లక్షలు ఖర్చుచేసి హెలికాఫ్టర్ అద్దెకు తెప్పించాలా అనుకుంటూ చెవులు కొరుక్కునారు అధికారులు..

ఉదయాన్నే మున్సిపల్ గౌండ్స్ కి హెలికాఫ్టర్ వచ్చి ఆగింది.. జనాలతో పాటూ అధికారులు, ప్రతిపక్ష, విపక్షాలూ గౌండ్ కి చేరాయి.. అక్కడికి చేరుకుని కారుదిగిన మేయర్ భుజాన పెద్ద మూట ఒకటి పెట్టుకుని నేరుగా హెలీప్యాడ్ వద్దకు వచ్చి హెలికాఫ్టర్ ఎక్కి పోనీ అన్నాడు.. ఆ మూట ఏవిటో, ఏం చెయ్యబోతున్నాడో అక్కడున్న ఎవ్వరికీ అంతుపట్టలేదు.. మనదేంపోయే జనాల సొమ్మేకదా అనుకున్నారు అధికారులు, మనకి కౌన్సిల్ లో గొడవ చేయడానికి మంచి సబ్జెక్ట్ దొరికిందని సంబరపడ్డారు ప్రతిపక్షాలు.. ఏదేమైనా ఆమేయర్ తీసుకెళ్ళిన మూట ఏంటో అక్కడెవ్వరికీ అంతుపట్టలేదు.. కొద్దిగా ఎగరగానే మూట విప్పిన మేయయ్.. మూటలోని గింజలను నేలపై విసురుతూ అదే చల్లుతుండటం చూసి బిత్తరపోయాడు పైలెట్.. నగరం నలుమూలలూ తిరిగి మూటలోని గింజలన్నీ చల్లి నాక తృప్తిగా క్రిందకు దిగాడు మేయర్..

 పైలెట్ ద్వారా మేయర్ ఏమిచేశాడో తెలుసుకున్న మీడియా, ప్రతిపక్షాలు.. విపక్షాలతో సహా రెండు లక్షలు నేలపాలు అని ఒహటే గొడవ.. ప్రతిపక్షనాయకుడు ఒక అడుగు ముందుకేసి పిచ్చోడు గింజలు విసిరెన్ అని పూరణ ఇచ్చాడు.. అదే నగరామంతా ప్రాకిపోయింది.. "ఏ నోట విన్నా పిచ్చోడు గింజలు విసిరెన్" అని ఒక సామెతలాగా ప్రాకిపోయింది..

 ఎవ్వరు ఎంత గోల చేస్తున్నా.. మేయర్ మాత్రం తొణకలేదు.. తాను చాలా గొప్పపని.. గతంలో ఎవ్వరూ చేయని పని చేశానని తృప్తితో గర్వంగా ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు.. ఇక అతనితో వాదన అనవసరం అని ఊరుకున్నారు...
**************************************      *****************************                        

20 ఏళ్ల అనంతరం..

ఆనగరం ఆకాశానికి పచ్చదనపు సోయగాలు చూపింది..
వర్షపాతంలో రికార్డు నమోదు చేసింది.
ఆరోగ్యంలో ఆసియాలో ఫస్ట్ నిలిచింది..
చల్లని గాలితో ప్రజలను అక్కున చేర్చుకుంది.


ఒక చిన్న పిల్లాడు..  తన తాతతో చెట్ల నీడన నడుస్తూ.. తాతా మనూర్లో ఇన్ని చెట్లు  ఎవరు నాటించారు.. అశోకుడా.. అ..? " అని అడిగాడు..

"పిచ్చోడు గింజలు విసిరెన్.." అనబోయిన అప్పటి ప్రతిపక్షనాయకుడైన తాత నాలిక కరచుకుని.. తడబడ్డాడు.. అప్పటి తప్పు మరలా చేయదలచుకోలేదాయన్.. అప్పటి మేయర్ ను పిచ్చోడు గింజలు విసిరెన్ అని అన్న వ్యక్తి అతనే..


అసలా రోజేం జరిగిందని గుర్తుతెచ్చుకున్నాడు అప్పటి ప్రతిపక్షనాయకుడైన తాత.

  మేయర్ ప్రమాణం తర్వాత మంచి వర్షాలు పడ్డాయి.. మధ్యలో హెలికాఫ్టర్ లో ఆకాశమార్గాన తిరిగిన మేయర్ ఊరంతా గింజలు చల్లాడు.
     .. కొండలు గుట్టలు.. ఎక్కడా ఖాళీ ప్రదేశాలూ వదిలి పెట్టకుండా గింజలు చల్లాడు.. ఆ తర్వాత వర్షాలు జోరుగాపడ్డాయి.. దీంతో గింజలన్నీ మొలకెత్తాయ్.. అత్యధికంగా మొక్కలన్నీ బ్రతికాయ్..

      దీంతో నగరం అంతా పచ్చదనం పరచినట్లైంది.. కేవలం రెండు లక్షలతో అడవినే పండించాడు మేయర్ అని తోచిందిప్పుడా నాయకుడికి.. వేలుముద్ర మేయర్ ముందు చూపుకి.. మనసులోనే హేట్సాఫ్ చెప్పుకున్నాడు..  మేయర్ ని అవహేళన చేసినందుకు చిన్నబుచ్చుకుని చుట్టూ పరచిన పచ్చసోయగాలను చూస్తూ.. "చదువుకున్న నాకంటే చదురాని మేయర్ ఎంతాబాగా భవిస్యత్తుని ఊహించాడు" అనుకుంటూ  నడినెత్తిన సూరీడు పెళపెళలాడే సమయంలో మనుమడితో కలిసి చెట్టు నీడలో  ముందుకు నడిచాడు అప్పటి ప్రతిపక్షనాయకుడు..

      "పిచ్చోడు గింజలు విసిరెన్" అని మేయర్ ని తననోటితో తొలిగా అన్నందుకు మనసులోనే క్షమాపణలు చెప్పుకున్నాడు., ఎందుకంటే ఆ మేయర్ చనిపోయి అప్పటికి చాలాకలం అయ్యింది నేరుగా వెళ్ళి చెప్పాలన్నా కుదర్దు...గనుక.

****************************************************

అదన్నమాట ఫ్రెండ్స్.. ఎక్కడికో వెళ్ళారు కదా.. వచ్చేయండి... అవును.. మరి ...

అందుకే మొక్కలు నాటండి.. మీ పిల్లల భవిష్యత్తుని కాపాడండి..
అన్నట్లు మిత్రులు మీరందరు ఎదో ఒక్కటి.... కొటేషన్ లేదా. కవిత.. లేదా. ప్రభుత్వానికి ఓ సలహానో, పద్యాలో ... ఇలా ఎదో ఒకటి కామెంట్ చెయ్యండి.. అవి పదిమందికి  ఇన్స్పిరేషన్ ఇచ్చేలా ఉండాలి..అవన్నీ ప్రభుత్వానికి నివేదించే  ప్రయత్నం చేద్దాం

.  "రానున్న వర్షాకాలంలో మొక్కలు నాటుదాం.. భవిష్యత్తుకు  పచ్చని సిరులు అందిద్దాం.."
                                                                                                                       -  మీ కరణం

ఫొటో గూగుల్ సౌజన్యం..

(ఇది కథారూపం మాత్రమే.. ఎవరినీ ఉద్దేసించినది ఏ మాత్రం కాదని మనవి చేసుకుంటున్నాను.. కాగా విజయవాడనగరంలో జంధ్యాల శంకర్ గారు చైర్మన్ గా ఉన్నప్పుడు అజిత్ సింగ్ గారు కమీషనర్ గా పనిచేసినప్పుడు విజయవాడలో గ్రీనరీ పెరిగేందుకు ఎంతో కష్టపడ్డారని, అందుకే అజిత్ సింగ్ గారి పేరిట విజయవాడ నగరంలో ఓ పేటకు నామకరణం చేశారని ఫేస్ బుక్ మిత్రుల్లో పెద్దలు తమ తమ కామెంట్ ద్వారా తెలిపారు.. కాబట్టి ఈ సందర్భంలో వారిని స్మరించుకోవడం స్ఫూర్తిదాయకమని నా భావన. నమోస్తు.)

Saturday 30 May 2015

//మౌనముని//


//మౌనముని//

     - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్, 29.05.2015

తనకు తాను భారమైనా
తాను ఏడ్వలేకున్నా..
తన స్తనాలెండి* పోతున్నా..
వాన మబ్బులు..
నీటి జాడలు
ఎండమావులైనా..
వేడి సెగలు ఉడికిస్తున్నా..
ఉక్కపోతకు ఊపిరి ఆగుతున్న

నిన్నుకన్న పాపానికి,,
నిన్ను మోస్తూనే ఉంది..
తనంతట తానేమీ అడగని అభాగిని
నిన్ను,నీతల్లినిగన్న ఈ ‘అవని’...
గుక్క నీరులేక
నోరు తెరిచేసింది..
నిలువ నీడలేక
భోరున విలపిస్తోంది..
నిప్పుల కుంపటిలా మారి
నిన్నే వెక్కిరిస్తోంది.   
నీ స్వార్ధానికి..
నీ స్వంతానికి,
నీ పంతానికి,
నీవు నరికిన పచ్చచెట్టు కోసం
ఆవురావురు మంటున్నది..
అక్సిజన్ ఎక్కడంటున్నది..
నీ  స్వప్రయోజనా చర్యలతో
బిత్తరపోతోంది..
బావురుమని..
చెమ్మగిల్లుతోంది.

ప్రచండ భానుడిని నిలువరించ
మొక్కనొకటి పెంచమంటూ
అంతకన్నా వేరఖ్కర్లేదంటూ..
దీక్షబూని రమ్మంటూ..
మౌనమునిలా చేతులు చాస్తోంది..
మలయమారుతమై
ఊపిరులూదమంటోంది.  


అంచలంచెలుగ పెరిగే భూతాపం ఆప,
ఒక్క మొక్కనైనా పెంచమంటోందిరా..
ఇంతకాలం తానేమీ అడగలేదుగా..
ఒక్కసారి మనసారా తన కోర్కె తీర్చరా.!
జన్మభూమి గొప్పదనం ఇంతని చెప్పలేమురా..
ఋణం  తీర్చుకోను మొక్క ఒక్కటి చాలురా!

నేటి మొక్కలే రేపటి ప్రకృతి
నేటి మొక్కలే రేపటి నీటిజాడ
నేటి మొక్కలే రేపటి జీవితం
నేటి మొక్కలే రేపటి అరణ్యం

పచ్చదనం మనకు శ్రీరామ రక్షరా..!
పచ్చదనం మనకు మూలధనం సోదరా..!
భవితలోన ఆనందపు సౌందర్యం చూడరా..!
                        - కరణం

(స్తనాలెండి పోతున్నా = చెరువులెండిపోతున్నా)
                                                                     


Tuesday 26 May 2015

అశోకుడు చెట్లు నాటించెను..

"అశోకుడు చెట్లు నాటించెను.."
                              -  కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ , 26.05.2015

    "అప్పుడెప్పుడో అశోకుడు నాటిన చెట్ల గురించి ఇప్పుడు మాకెందుకు సార్.. చరిత్ర ఉత్త చెత్త" అనేవాళ్ళో..అనుకునే వాళ్ళు కోకొల్లలు.. నిజంగా ఆ పాఠాలు ఇప్పుడు పిల్లలతో పాటు పెద్దలకీ వినిపించాలేమో .. !   లేకుంటే ..

ఏమిటీ విపరీతం.. ఎందుకీ దుస్థితి.. ఎవరు కారకులు...??

           గడిచిన వారం రోజులలో రెండు తెలుగు రాష్ట్రాల దీనస్థితి చూస్తుంటే..  నాకు చిన్నప్పుడెప్పుడో చూసిన "ఆదిత్య 369" చిత్రం గుర్తొస్తోంది.. కొద్ది రోజుల్లో మనం మర మనుషుల్లా.. వాతావరణం లోంచి వచ్చే వాయువులను తట్టుకోవడానికి మాస్క్ లు ధరించాలేమో..!


ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం  ప్రతి ఒక్కరికీ ఉంది.. ఇది నిజం.. మనం నిజం మాత్రమే మాట్లాడుకుందాం కాసేపు..

      నేను నేల మీద ఆంలెట్ వేశానేను మూడేళ్ల క్రితం అప్పుడు వడదెబ్బ మృతులు అతి తక్కువ నమోదయ్యాయ్.. అప్పుడు నమోదైన ఉష్ణోగ్రతలు 47- 48 వరకూ అత్యధికంగా, రామగుండం ని మించి భానుడు భగ్గుమన్నాడు..



        ఇప్పుడు గత రెండేళ్లలో కన్న ఉష్ణోగ్త్రతలు తక్కువే 43- 46 వరకే నమోదవుతున్నయ్.. కొండకచో 47 డిగ్రీలు.  అయినా  వృద్ధులు, పిల్లలు పిట్టల్లా నేలరాలుతున్నరు.. పండుటాకుల పరిస్థితి శోచనీయం. కనీసం గంటకు ఒకరుగా వడదెబ్బకు మృతి చెందుతుంటే ఒక జర్నలిస్టుగా నిశ్చేష్టుణ్ణయ్యా.. మృతిచెందిన వారిలో పదొకొండు రోజుల పసికందు నుంచి 75 ఏళ్ల వృద్ధుడి వరకూ ఉన్నారు.. ఆంధ్రా, తెలంగాణా వారితో పాటు అర్జెంటీనా యాత్రికుడు ఉన్నాడు..

ఒళ్ళంతా ఒకటే మంట.. ! ఉక్కపోత.. వరంగల్ లాంటి చోట ఆక్సిజన్ కూడా అందలేదని ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది..

మరి ఇంతమంది మృతి చెందడానికి ఎవరు కారణం..? ఈ పరిస్థితికి కారణం ఎవ్వరు..?
మనమే..! అని నాకనిపించింది. మనం వాడుతున్న ఫ్రిజ్ లు, ఏసిలు వగైరాలు ముఖ్యభూమిక పోషిస్తుంటే.. అడ్డగోలుగా చెట్లు నరకడం మరో దారుణం. మనల్ని ఇప్పుడు ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడలేవు..

  "పచ్చని చెట్టు మాత్రమే మనల్ని కాపాడ గలిగే ఏకైక అస్త్రం.".



ఇవి పాటిస్తే బావుండు...



 1. ప్రతి మనిషి కనీసం రెండు చెట్లను అధికారికంగా దత్తత తీసుకోవాలి..
 2. ఇళ్ళలో ఎవరైన పుట్టిన వెంటనే రెండు చెట్లు వారి పేరు మీద నాటాలి.
3. అవసరార్ధం ప్రభుత్వ సర్వెంట్లు చెట్టు నరకాల్సి వస్తే వారు వెంటనే పది చెట్లు నాటేలా చర్యలు తీసుకోవాలి.
4. ఇళ్ళలో జరిగే ప్రతి కార్యక్రమానికి గుర్తుగా ఒక చెట్టు నాటాలి.
5. పెద్ద కార్యక్రమాలకు అంతే పెళ్ళి వంటి కార్యక్రమాలలో ప్లాస్టిక్ డబ్బాలు..స్టీలు బొచ్చ్చెలు బదులుగా ఒక మొక్కను పంపిణీ చెయ్యాలి..

ఇలా వీలైనన్ని చెట్లు నాటడం చేసేందుకు ఇవే కాక,  మీకు వీలైన పద్దతులు ఎంచుకోవచ్చు..

పెరట్లో చెట్టు పెంచడం వల్ల భూగర్భ జలం అభివృద్ధి చెందే అవకాశం కూడా మెండుగా ఉంటుంది.. ఉదయం కాలం ఆక్సిజన్ ఇస్తుంది.  చక్కని నీడతో పాటు.. చల్లని గాలిని ఇస్తుంది..
                              
                             - మీ కరణం, 26.05.2015

Tuesday 5 May 2015

అందాల గులాబిని

//అందాల గులాబిని //
                             - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                             ౦౫.౦౫.౨౦౧౫
                                             05.05.2015

అందమా..?
అంటే..?
నాకన్నా ఎవరిదిరా అందం..?

అందాల పోటీల్లో ఆరబోయటమా అందం..
అరగుడ్డలేసుకుని చిందులేయడమా అందం..
అడ్డగోలుగా మేకప్పేసుకుని కప్పు లేపేయడమా అందం..

ఏదిరా.. ?           


అందమెక్కడ.?
 నాకన్నా అందమా వారిది??

నీకు ఒళ్ళు బలిసి విసిరిన..
 మీ అమ్మ రొమ్ము  పాలు
ఆసిడ్ గా మారి నన్ను హత్తుకున్నాయిరా,,

నీకు మదమెక్కి విసిరిన..
 నీయక్క పెట్టిన అన్నం ముద్ద
ఆమ్లమై నన్ను ముద్దాడిందిరా..!

నీ కొవ్వుతో విసిరెసిన..
నీ చదులమ్మల సిరా ..
అశ్రువై  నన్ను చేరిందిరా..!
 

కానీ..
నువ్వు మాత్రం  నన్ను తాకలేదు..       
నీ నీడ  కూడా నన్ను చేరుకోలేదు..
నీ జాడకి కూడా ఆ ధైర్యం లేదు..
అసలు నీలాంటి వాడు ఎప్పుడు గెలవడురా..!

గెలిచింది నేనే..! అందాల గులాబిని నేనే..!

దొడ్లుకడిగే యాసిడ్ కన్నా  నీచమైనదిరా నీ జన్మ..!
కనిపెంచిన ఆడదానికి తలవంపురా నీ జన్మ..!
మనిషిగా పుట్టిన మహిషి  నీవు..
మమతానురాగాలు తెలీని మృగం నీవు.
శతాబ్దాలు గడుస్తున్న మారని జాతి బలుపు కు రూపం నీవు..
కామంతో మూసుకున్న గుడ్డి జన్మరా నీది..!

ఏది రా అందం...ఏదిరా చందం..??
మనిషిని మనిషిగా ప్రేమించడంలో ఉందది,
మనిషిని మనిషిగా చూడటంలో ఉందది,
మనిషి మనిషిగా బ్రతకటంలో ఉందది..,
అదిరా అందం.. అదిరా  సోయగం

నిన్ను  తిరగానిస్తున్నానంటే..ఆ అందం నాలో ఉంది
నిన్ను బ్రతకనిచ్చానంటే,.. ఆ అందం నాలో దాగుంది
నిన్ను క్షమించటంలోనే .. ఆ అందం నిబిడి ఉంది
అర్ధమైఁదా.. అందం నాలో మాత్రమే ఉందని....!

నా ఒళ్ళంతా అందముంది..
నా మనసంతా సౌందర్యముంది
అది అంత, ఇంత కాదురా..!
నా సొగసు నీవందుకోలేనంత...
 ఆ నా సోయగం ఎవరెస్ట్ అంత.
నా ముందు నీ బ్రతుకెంత..?
----------------------------------------------------


Sunday 22 March 2015

శ్రీరాముడికి సోదరి ఉందని తెలుసా..??

శ్రీరాముడికి సోదరి ఉందని తెలుసా..??

                   - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                      22.03.2015

దశరధునికి భార్యలు మువ్వురు కౌసల్య సుమిత్ర కైకేయి..

ధసరధునికి  పుత్రులు నల్గురు.. రామలక్ష్మణభరత శతృఘ్నులు.. అదే కదా మనకి తెలిసింది.. మరి శ్రీరామునికి సోదరి కూడా ఉందని తెలుసా..?

 సోదరి అంటే పెద్దదా చిన్నదా? అంటే అక్క?? చెల్లెలా??

ఉంటే ముగ్గురు భార్య లో ఎవరు కన్నారు??  ఆమె ప్రస్తావన ఎక్కడా ఎందుకు కనబడలేదు..? ఉంటే ఆమె పేరేమిటి?? ఇత్యాది అనుమానాలు టక టక మీ మనసు రామాయణాన్ని శోధిస్తోంది కదూ../ విచిత్ర రామాయణంలో ఆమె ప్రస్తావన ఉంది.

ఆమె పేరు శాంత.

శాంత గురించి పెద్దగా మనకు తెలీదు..

ఈ శాంత గురించి కాస్త మనమూ తెలుసుకుని .. భవిష్యత్తుకూ అందించాల్సిన బాధ్యత ఉందనిపిస్తోంది..

శాంత కథ  తెలుసుకుందామా..?



శ్రీరాముడు ఇత్యాదులు పుట్టక మునుపు ధశరధునికి సురభి అనుగ్రహంతో పుట్టిన కుమార్తె శాంత..

    దశరధుని స్నేహితుడైన  అంగరాజ్యాధిపతి రోమపాదుడి కి పిల్లలు లేకపోవడంతో శాంత ను అక్కడ పెంచే ఏర్పాటు చేశారు. కొందరి వివరాల ప్రకారం ఆరునెలలు రోమపాదుడి ఇంట అంగరాజ్యంలో , మరో ఆరునెలలు దశరధుని ఇంట అయోధ్యలో  పెరిగేది శాంత.

 యుక్తవయస్కురాలైన తర్వాత  ఆమెకి దశారధుడు స్వయంవరం ప్రకటిస్తే.. ఆగ్రహంతో రాజప్రాసాదం చేరుకున్న  పరుశరాముడు , శాంత వివాహాన్ని అడ్డుకునేందుకు  దశరధుని పై కత్తి దుశాడు.  వశిష్టుడు అడ్డుపడి పరుశరాముని శాంతిబరచి, అనంతరం .. పరుశరాముని ఆదేశం ( బ్రాహ్మణునికిచ్చి చేయమని) మేరకు ఋష్యశృంగ మహర్షికి ఇచ్చి వివాహం  చేయడం జరిగింది..  శ్రీరామాదులు జన్మించడానికి కారణమైన పుత్రకామేష్టి యాగమును దశరథునిచేత చేయించినది ఈ ఋష్యశృంగుడే!  కాబట్టి  శ్రీరామాదుల న్వంత అక్క గారే..శాంత.

 దీనికి ఆధారాలుగా జానపదం లో శాంత ప్రస్తావన ఉంది. శ్రీ సత్యనారాయణ పిస్కావారు తన్ బ్లాగ్ లో అందించిన ఓ జాణపదంలో శాంత ప్రస్తావన కనబడింది.. ( http://andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=238&PageNum=4 )

      శాంత :

       " అక్కచెల్లెండ్రు మీరూ మిక్కిలీ సౌందర్యశాలులమ్మా
        మా తమ్ములు నలుగురినీ వలపించు జాణలకు దౄష్టి తగులూ
        దృష్టి తగులాకుండనూ నీలాల నివ్వాళులివ్వరమ్మా


         (అని సీతమ్మకే మారు వడ్డించింది. గడసరి సీతమ్మ ఊరుకుంటుందా!)


        మాయన్న ఋష్యశృంగూ వనములో కూడి యెడబాయకున్నా
        ఏమి యెరుగని తపసినీ ఓ వదినె! కేళించి విడిచినావూ
        దృష్టి తగులాకుండనూ నీలాల నివ్వాళులివ్వరమ్మా "

ఈ రెండు పాదాలు శ్రీరాం సోదరులకు అక్క ఉన్నదని ఖచితంగా రూఢి చేస్తున్నాయ్.. కాగా ఆమె భర్త ఋష్యశృంగుడనీ ఖరారు చేస్తున్నాయ్.



 

"లవకుశ" సినిమాలో శాంతాదేవి పాత్ర ఉంది. గుర్తొచ్చిందా..? . ఆ పాత్రను అలనాటి నటి సంధ్య (తమిళనాడు మాజీముఖ్యమంత్రి జయలలిత  కన్నతల్లి) పోషించారు.   
  వీలైతే "లవకుశ" మళ్ళీ చూడండి. ఇక, శాంత వివాహవృత్తాంతం పాతచిత్రం "ఋష్యశృంగ" లో చూడవచ్చును. అలనాటి నటుడు ముక్కామల కృష్ణమూర్తి ఈ చిత్రమును నిర్మించారు. అందులో ఋష్యశృంగునిగా అందాలనటుడు హరనాథ్ నటించారు. శాంతగా ఆశాలత అనే నటి వేసింది. ఇంకా రాజసులోచన, ముక్కామల వగైరాలు నటించారు.


కాబట్టి మిత్రులారా..! దశరధునికి పిల్లలు ఐదుగురు..  శ్రీరామ సోదరుల ఏకైక సోదరి శాంతాదేవి.

Saturday 21 March 2015

ఉగాది తెలుగు వారిది మాత్రమేనా..??

ఉగాది తెలుగు వారిది మాత్రమేనా..?? 
                        - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                           31.03.2014

లేలేత కిరణాలు...
వీడని మంచు తెరలు..
రాలిన సుమాలు..
కోయిల కేరింతలు..
కొత్త చివురులు..
చిలక పలుకులు....
మామిడి రుచులు..
ప్రకృతి రమణియతను ఇంత అందంగా కళ్లకు కట్టేది.. వసంత రుతువు.

ఒక సారి ఋతువులను తెలుసుకుందాం :

౧. వసంత రుతువు
౨. గ్రీష్మ రుతువు
౩. వర్ష రుతువు
౪. శరద్ రుతువు / శరదృతువు
౫. హేమంత రుతువు
౬. శిశిర రుతువు

రుతువులలో ..తొలి ఋతువు వసంతం.. వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం..తొలి పక్షం శుక్లం.. అందులో తొలి రోజు పాడ్యమి.. ఆ రోజే ఉగాది..

సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి సంక్రమణ సమయంలోని చంద్రోదయం తదుపరి ఉగాది అని చెప్పటం జరుగుతోంది.

అసలు ఉగాది నేపథ్యం చూద్దాం..!

ఉగాది సంస్కృతం నుంచి వచ్చిన పదం. యుగ+ఆది
యుగ అనగా కాలం / వయస్సు అని అర్ధాలున్నాయి.(ఇంకా అనేకం వున్నాయు.), ఆది అనగా మొదలు అని అర్ధం.
శ్లో : యస్మిన్ కృష్ణో దివంవ్యత:
తస్మత్ ఏవ ప్రతిపన్నం కలియుగం                   



అని మహర్ష వేదవ్యాసుల వారు కలియుగారంభం గురించి ప్రకటించారు. అంటే ద్వాపర యుగం అంతంలోకృష్ణుడు ప్రపంచాన్ని విడిచి వెళ్ళిన నాటి నుండి.. కలియుగం ఆరంభం ఆయినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. కృష్ణుడు తన అవతారం చాలించిన తదుపరి బ్రహ్మ కలియుగ సృష్టిని ఆరంభించిన రోజునే యుగాది అంటారని కూడా తెలుస్తోంది.

సుమారు క్రీ.పూ. 3012 ఫిబ్రవరి 17/18 అర్ధరాత్రి నుంచి కలియుగం ఆరంభమై వుండవచ్చని గణిత శాస్త్రజ్ఞుల అంచనా..!
ఇక ఖగోళ ,గణిత శాస్త్ర కోవిదుడు అయిన భాస్కరాచార్య.. 12వ శతాబ్ధంలో యుగాది ఆరంభం గురించి ఇలా చెప్పారు.

" చెట్లకు ఆకురాలి, తిరిగి ఆకు చిగురించు కాలాన్ని.. తొలి ఋతువుగా.. కొత్తనెల ,కొత్త పక్షం, కొత్త ఘడియలను.. దక్షిణం నుంచి ఉత్తరానికి రవి సంక్రమణ సమయంలో చంద్రోదయం వెంట వచ్చే తొలి ఘడియల నుంచి ఉగాది ప్రారంభం అయినట్లు భాస్కరాచార్య.. లెక్కలు గట్టారు. దీంతో ల్యూనార్ క్యాలెండర్ (భారతీయ పంచాంగం..)చంద్రమాన పంచాంగం ప్రకారం నూతన సంవత్సరం.. చైత్రమాసం శుక్ల శుద్ధపాడ్యమి రోజు ప్రారంభమౌతుందన్నమాట.

శాలివాహన శకం ఆధారంగా మన పంచాంగం (కాలెండర్) రూపొందించ బడింది. గౌతమీ పుత్రశాతకర్ణి ఆయిన శాలివాహనుడు ఆయన హయాంలో భారతీయ పంచాంగం రూపొందింపజేశారు. అనాటి నుండి కాల నిర్ణయం చేసి రూపొందించడం వల్ల అది శాలివాహన శకం గా పేర్కొనబడింది. ఆంగ్ల గ్రెగోరియన్ కాలెండర్ కు భారతీయ పంచంగం (ల్యునార్ క్యాలెండర్ కు 78 ఏళ్ళ తేడా ఉంటుంది. అంటే గ్రెగోరియన్ కాలెండర్ ప్రకారం 2014 అయితే.. శాలివాహన శకం ప్రకారం 1936 వ సంవత్సరం నడుస్తుందన్నమాట.! శాలివాహన శకం పంచాంగం ప్రకారం.. ప్రతి 60 ఏళ్ళు తిరిగి వస్తాయి. మొదట ప్రభవ నామ సం వత్సరంతో మొదలై 60 పూర్తి చేసుకుని మరలా ప్రభవ నామ వత్సరం వస్తుందన్నమాట.! గ్రెగోరియన్ లేదా హూణ లేదా ఆంగ్ల కాలెండర్ ప్రకారం మార్చ్ నెలాఖరు లేదా ఏప్రియల్ తొలివారాలలో ఈ ఉగాది పర్వదినం వస్తుంది.

అరవై సంవత్సరాలు..
1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాథి, 14. విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవలంభి, 32. విలంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృత్, 37. శోభకృత్, 38. క్రోధి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృత్, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్త, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ.






ఈ ఉగాదిని ముఖ్యంగా వింధ్యపర్వతాలు, కావేరీ మధ్యనున్న దక్షిణభారతీయులు జరుపుకుంటారు.. వీరు మాతమే కాక ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలోని హైందవ సంప్రదాయం పాటించే వారు,వందల ఏళ్లక్రితం స్థిర నివాసాలేర్పరచుకున్న హైందవ సంచార జాతులు ఒకే రోజున ఉగాదిని జరుపుకుంటారు. అంతే కాక మరి కొన్ని రాష్ట్రాలలో కొద్ది రోజుల తేడాతో ఉగాది జరుపుకోవటం కద్దు.

తెలుగు - ఉగాది
కన్నడ - యుగాది
కొంకణి/మరాఠి - గుడిపాడ్వా/యుగాది
పశ్చిమ బెంగాల్ - నాభ భార్ష
రాజస్థాన్ లోని మార్వరి అనే తెగ వారు - తపన
పంజాబ్ - బైసాకి
తమిళనాడు - పుతాండు
మణిపురి - సజిబు నోంగమా పెంబ
సింధులోని సింధు తెగ వారు - చెటి చాంద్
అస్సాం - బిహూ
ఇండోనేషియా,బాలి లోని ' మురి తియూస్ ' అనే హిందూ తెగ వారు - నేపి
అనే పేరుతో ఉగాది జరుపుకుంటారు.

ఇక అత్యంత ప్రాముఖ్యం ఉగాది పచ్చడిది. ఉగాది పచ్చడిని 'కదంబ బజ్జి,'కదంబం,అని కూడా అంటారు. షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. షట్ ముఖాలకు ప్రతీకే ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ ఉగాది పచ్చడి.



పచ్చడి లో ఏమేం వాడతారు .. వాటి ఉద్దేశ్యం తెలుసుకుందాం..!

తొలిగా పుచే వేపపూత - చేదు - దిగులు, విచారం
తొలి చెరకు, బెల్లం - తీపి - ఆనందం , సంతోషం
తొలిగా పండించిన ఉప్పు - లవణం - భయం
పండించిన చింతపండు - పులుపు - చిరాకు
మిరియం ,కారం - కటువు - క్రోధం, ఆవేశం
తొలి మామిడికాయ - వగరు - ఆశ్చర్యం

ఇతరములు వారి వారి ఇష్టంతో లేక ప్రత్యామ్నాయంగా కలుపుకునేవి మాత్రమే..!

కొత్త ఆశ

// కొత్త ఆశ //
                                                       - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                                                            21.03.2015

నిజమే..!
మనిషి ఆశా జీవి..
ఆ ఆశే మాకు శ్వాసై
ముందుకు నడిపిస్తోంది..
ఎన్నికల వాగ్దాన రాజులపై ఆశ
కష్టాలు గట్టెక్కిస్తాడేమోనని,
కొలువైన రాజాధిరాజుల పై ఆశ
తోడుగా ధైర్యం ఇస్తారేమోనని,
పాలకులపై ఆశ..
ధరాభారం దించేస్తాడేమోనని,
కోటి దేవుళ్లపై ఆశ
కోరికల చిక్కుముళ్ళు విప్పుతారేమోనని,


ప్రతి ఏటా నీమీదా మాకెంతో అదే ఆశ..
కొత్త పుంతలు తొక్కిస్తావని
కొత్తగా చిగురిస్తావని..
కొత్త రాగాలు వినిపిస్తావని
కొత్త శ్వాస నింపుతావని..
కొత్త పచ్చదనపు సిరికురిపిస్తావని..
కొత్తగా మరేదో తెస్తావని..

ఎప్పటకప్పుడు అంతే ..!
మేం ఎదురుచూస్తూనే ఉంటాం..
 అవును..  మనిషి ఆశాజీవి మరి.!!

           

Sunday 15 March 2015

మనుశాస్త్రం వడ్డీ గురించి ఏంచెప్పింది??

వడ్డీ ఎంత తీసుకోవాలి?? మను ధర్మం ఏం చెప్పింది??
                                              - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                                                    03.03.2015





మనం రోజూ పేపర్లోనో , టీవీల్లోనో చూస్తూ ఉంటాం.. సూక్ష్మ వడ్డి ఋణం ధాటికి విలవిల.. అనో బ్యాంకుల్లో వడ్డీ రేటు తగ్గింపనో..పెరిగిందనో .. ఇలా అనేకం డబ్బు వడ్డీ రూపంలో చేతులు మారటం చూస్తూ ఉంటాం. మరి వేలకు వేలు వడ్డీ వసూలు చేయడం అన్యాయం అని గొంతుచించుకున్నా.. ఎవ్వరూ వినే పరిస్థితి లేదు. అధిక వడ్డీ ముక్కు పిండి వసూలు చేసి జేబులు నింపుకోవడం ఇప్పుడు వడ్డీ వ్యాపారుల ఏకైక లక్ష్యం.   మరి మన సంస్కృతి లో వడ్డీ గురించి ప్రామాణీకమేమైనా ఉందా..? ఉంటే ఏం చెప్తోంది..?


మన ధర్మ శాస్త్రాల్లో ప్రామాణికం మనుధర్మ శాస్త్రం.  భారత రాజ్యాంగానికి ఇతర దేశాల రాజ్యాంగాల తో పాటూ మను ధర్మ శాస్త్రం కూడా ఉపయోగపడిందనటంలో సందేహం లేదు. మరి మన పాలిట ధనువైన మనువు వడ్డీ గురించి ఏమి చెప్పారంటే..


వశిష్ఠ విహితాం వృద్ధిం సృజేద్విత్త వివర్జినీం
అశీతి భాగం గృహ్ణీయాన్మాసాద్వార్దుషిక: శతే!!




  ఋణం మీద అత్యధికంగా వడ్డి ఎంత తీసుకోవచ్చో ఈ  శ్లోకం చెబుతోంది.  అత్యధికంగా నూటికి 80 వ వంటు అంటే వంద రూపాయలకి రూపాయై పావలా మాత్రమే వడ్డీ అత్యధికంగా తీసుకోవాలని మనువు తన ధర్మ శాస్త్రంలొ సూచించాడు.

ఆహా..! ఎంత దూర దృష్టి.. కదూ.. మనవాళ్ళు ముందు ముండు ముక్కు పిండుతారని అప్పుడే ఊహించారు మహానుభావుడు.. నమోస్తు మనువు.. మా పాలిట ధనువు.

Monday 9 March 2015

ఏమని పొగడెదము నిను..??

// ఏమని పొగడెదము నిను..??//
                                              - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                                                       08.03.2015

మహిళా..! నిను పొగడగ మాతరమే..?
మహిన నిను తలచిన యదపొంగునే..!

బ్రిటీషు ముష్కరులనెదిరించిన ధీశాలి
తొలి రాజకీయ ఖైదీ మంగతాయారు వో
స్వతంత్ర్య భారతి సిగ మెరిసిన సరోజినీ సుమానివో
స్వేచ్చాభారతాన శాసనాధ్యక్ష విజయలక్ష్మి దరహాసానివో
ప్రతిభ చాటిన ప్రధమ ప్రమద ప్రతిభాపాటిల్ ఖ్యాతివో
ప్రధమ ప్రధానిగ వెలిగిన భారత రత్నం ఇందిరమ్మవో

మహిళా నిను పొగడగ మాతరమే..!
మహిన నిను తలచిన యదపొంగునే..!





ఐపిఎస్ కిరణానివి నీవని
డిజిపి కాంచనచంద్రం నీవని
అశోక చక్రధారి నీర్జభానోతు నీవని
ఆకాశాన రెక్కకట్టెగిరిన హరితాకౌరు నీవని
మురిసెనే ఈ అవని
అణువణువు నీదని

మహిళా నిను పొగడగ మాతరమే..!
మహిన నిను తలచిన యదపొంగునే..!

అందానికి పుట్టిల్లు ఈ నేలంటూ..!
చాటావు ప్రపంచాన సుందరి రీటాఫారియావై
ఎవరికన్న మేము తక్కువంటూ.
ఎవరెస్టు ఎక్కినావు బచ్చేంద్రపాలువై
స్పేష్ షిప్పులోన రోదసికేగిన కల్పనచావ్లావి నీవై
అంగ్ల చానెల్నీదిన ఆరతిషావై
టెన్నీసు సంచలనం సానియావి నీవై

ఎదిగేవమ్మా..ఇల మెరిసేవమ్మా!
నిను తలచి మామది మురిసేనమ్మా!

న్యాయశిఖ ఫాతీమాబీబీవి
రాయబారి ముత్తమ్మ బింబానివి
నోబెల్ థెరిస్సా సేవారూపానివి
బుకర్ నెగ్గిన అరుంధతీ(రాయ్)వి
ముఖ్యమంత్రిగ ఏలిన సుచేంద్రకృపలానీ

ఏమని పొగడము నిను కలువకంటి
చక్కనమ్మ, చక్కెరబొమ్మ
చారులోచన, తరళేక్షణ , ముదితా
లతాంగి, వలజ, సారసాక్షి,సుదతి,సుమతి
నమోస్తుతే   నెలత, నళినలోచని
కైమోడ్పిదే కోమలి , కిన్నెరకంఠి

ఓ...
మహిళా నిను పొగడగ మాతరమే..?
మహినా నిను తలచిన యదపొంగునే..!

           
             

మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో ...స్త్రీలలకు శతకోటి వందనాలు సమర్పిస్తూ , తొట్టతొలి  భారతీయ మహిళాశిరోమణుల నామాలతో కూర్చిన చిరు కవితాంజలి. -    - కరణం

Tuesday 3 March 2015

మూఢాచారాలా..?? ఎలా??-2..పిండం పెట్టడం ఎందుకు..??

మూఢాచారాలా..?? ఎలా?? 
           - కళ్యాణ్ కృష్ణ కుమార్. కరణం, చీరాల

2.  పిండం పెట్టడం ఎందుకు..??

 "యావత్ పిండ మనుష్యాని
గంగా తోయేషు తిష్టతి
తావద్ వర్ష సహస్రాణి
స్వర్గలోకే మహీయతే..!"

(ఎవరిని ఉద్దేసించి నీటిలో పిండ ప్రదానం జరుగుతుందో వారికి వేయి వత్సరాలు స్వర్గలోక ప్రాప్తి.)

ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళకీ హైందవం అంటే చిన్నచూపు.. వ్యంగ్య భావన ఎక్కువయ్యాయ్ . దానికి కారణమూ లేకపోలేదు..

1. ముందుతరం, తరువాత తరానికి అందించాల్సిన స్థాయిలో జ్ఞానం అందించక పోవటం..

2. జ్ఞానం అందించే స్థానంలో ఉన్నవారు, సంపూర్ణంగా చెప్పలేకపోవటం,

3. చెప్పగలిగేవారు సంపూర్ణంగా లేకపోవటం .

4. అసలేమిటీ ఇందులో మర్మం అని తెలుసుకునే ప్రయత్నం చేసేవారు మృగ్యమవడం.

5. ఎవరేది అంటే అది నిజమే అన్నట్లు తలూపడం, నిజమని భ్రమలోకి జారుకోవటం.

 6. అర్ధమయ్యే రీతిలో చెప్పినా అర్ధం చేసుకోలేని అజ్ఞానంలో ఉండటం
7. సంస్కృతం , ప్రాకృతం వంటి బాషలు కనుమరుగవడం.

8. జాతి నాశనానికి కొందరు పాలకులు చేసిన కుట్రలో భాగంగా సంస్కృతి, సంస్కృతం మూలాలు నాశనమొనరించడం.

9. హేతు వాద తత్వం.. ఇతర మతాల సంస్కృతి దాడులు.. మొదలైనవి ఎన్నో వున్నాయ్. వాటి గురించి  ఆలోచిస్తుంటే అనంతాలేమో అనిపిస్తుంది.

కాయలున్న చెట్టుకే రాళ్ళు :

.. కాయలున్న చెట్టుకే దెబ్బలు .. కదా..! ఎన్నో ఫలాలిచ్చే హైందవ చెట్టుకే  రాళ్ల దెబ్బలు.. హేతు బద్దంగా సమీక్షిస్తే హైందవం మొత్తం సైన్స్ నిండి ఉండన్న సత్యం.. నాస్తిక శిఖామణులకి, హేతువాదులకి, ఇతర మతస్తులకీ మింగుడు పడని నిజం.

  అరే  విదేశీయులు గుర్తిస్తున్నార్రా..! అని మొత్తుకున్నా.. ఇక్కడ పుట్టిన కొందరు మూర్ఖులకు చెవికెక్కదు. అందుకేనేమో "మొండివాడు రాజుకన్న బలవంతుడ"న్నారు పెద్దలు.

ఇక అసలు విషయానికి వద్దాం.. పిండం పెట్టడం అనవసరమా..? (ఇటీ వల ఒక చిత్రం లో ఒకానొక సందర్భంలో వేసిన ప్రశ్న ఇది.)

    కొందరు ప్రబుద్దులు.. వారి సూక్ష్మ బుద్ధికి పదును పెట్టి వేసిన ప్రశ్న.. ఇది.. ఇప్పుడు నాస్తిక, హేతువాద,  పరమతస్థులకు ఒక సాకుగా దొరికింది..

ప్రశ్న : " పిండం అంటూ నీళ్లలో వేసే అన్నం ముద్ద మరొక పేదవాడికి  కడుపు నింపుతుంది  కదా..?"

"శెభాష్.. నిజమే" అనిపిస్తోంది కదూ..??

మరి ఆ అభిప్రాయం నిజమా? అంటే,  ఆ భావన 100శాతం తప్పు .!

మరి ఎందుకో తెలుసుకోవాల్సిన బాధ్యత మనమీదుందని గుర్తించాలి. అందుకే ఎందుకో ఇప్పుడు తెలుసుకే ప్రయత్నం చేద్దాం.

     

పిండం  : ఇవి పలు రకాలు.. కర్మకాండలకు , రకరకాల పిండాలు పెట్టడం హిందూ సంస్కృతిలో ఉంది.. కొందరు మాత్రమే పాటిస్తున్నారు.. కొందరు రాను రాను విసర్జించి ఉంటారు. కొందరు తొలినాళ్ళ నుంచి పాటించి ఉండక పోవచ్చు.

ఈ ప్రశ్న కు సమాధానం చూసే ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

విశ్వంలో మనిషి మాత్రమే ఉన్నాడా??  ప్రాణంతో ఉన్న ఇతర జాతులేమీ లేవా?

మీరనే సైన్సే ఏమి చెబుతోందో తెలుసా..!??
     
8.7 మిలియన్ల జీవరాశులు భూమిమీద జీవిస్తున్నాయని సైన్స్ పత్రిక చెబుతోంది. ఇంకా కూడా ఎక్కువే ఉండొచ్చుకూడా.

ఇక భారతదేశం కి వస్తే అవి కూడా ఖచ్చితంగా లక్షల సంఖ్యల్లోనే ఉంటాయి.

       అందరికన్న మేథస్సున్న మానవుడు మూఢాచారాలు నమ్మొచ్చా?  అనే వాదం ఉన్నవారికి,  మరి ఆయా ఇతర  జీవులు ఎలా జీవిస్తాయో అన్న అనుమానం ఎందుకు కలుగట్లేదో అర్ధం కాని ప్రశ్న.

మన కడుపుకి తింటే చాలా..??

    ఒక గిరి గీసుకుని అందులో మఠం వేసుకు కూర్చుని, ఎదుటి వారిమీద దుమ్మెత్తి పోయటం చాలా సులభమే..! కానీ గతించిన మంచోళ్ళు అలా చేయలేదు.. పూర్వీకులు అన్నింటి గురించీ పట్టించుకున్నారు. అన్ని ప్రాణుల అవసరాలనీ ఏదో ఒక రూపంలో తీర్చాలన్న నీతి ని ప్రభోదించారు..

అందులో భాగమే ఈ పిండ ప్రదానం,తర్పణం అనే కార్యక్రమం లేదా క్రతువు.

ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు కాలం చేసినప్పుడు పిండం పెట్టడం ఆచారం..

  శాస్త్రంలో మంత్ర విధానంగా  ..
"ఇదం పిండంగృధ్ర వాయస, జలచర ముఖేన ప్రేత భుజ్యతాం"
(గద్దలు, కాకులు, జలచరాలు రూపంలో  పిత్రుదేవతలకు ఆహారం అందించాలి)

1. కాలం చేసిన వారి పేరుతో , వారిని గుర్తుంచుకోవాలనే ఉద్దేశ్యంతో (ఆత్మ శాంతి కోసం) ఊరి జనం మొత్త్తాన్ని పిలిచి స్థోమతకు తగ్గట్టు అన్నదానం చేస్తారు. ఇది బ్రాహ్మణ , బ్రాహ్మణేతరులకు కూడా అన్నదానం జరుగుతుంది. కాబట్టి మనుష్య జాతికి భోజనం పెట్టారు ఆ కుటుంబం వాళ్ళూ.

2. వాయస పిండం (కాకి కి పిండం) :
       "కాకులు దూరని కారడవి అంటారు." ఈ ఉపమానం ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. అంటే కాకి ఎక్కువగా కనిపించే పక్షి జాతి కి చెందిన జీవి. (క్రతువు ఎప్పుడు, ఎక్కడ,మాసికమా, ఏడూడా అనేది మాత్రం ఇక్కడి సమస్యకాదని పురహితులు గుర్తించాలి.) ఆ పక్షిజాతికి భోజనం పెట్టడం అనేది అందులో పరమార్ధం .
నువ్వులు, అన్నం,నెయ్యి కలిపిన ముద్ద పెడతారు.
అంతే ఇక్కడ కాకి తినే పదార్ధాలనే ఉపయోగిస్తారనేది గ్రహించాలి.

3. వికిర పిండం /నీటిలో వదిలే పిండం:  ఇక ఈ పాటికే మీకు సమస్యకు సమాధానం  అర్ధం అయి ఉంటుందనుకుంటున్నా..! కానీ మన హేతువాద సోదరులకి హేతుబద్ధంగా చెప్పాలనేదే ఈ ప్రయత్నం.!
   నీటిలో అనేక జీవజాతులున్నయ్. మనిషి కన్న ముందు పుట్టిన మత్స్యజాతి  ఉంటుంది. ఆ చేపలకు ఆహారమే నీటి లో వదిలే పిండం.

    మనిషికి , పక్షిజాతికి, జలచరాలకీ కూడా ఆహారం అందిస్తున్నారు.. అది కూడా చనిపోయిన వారి పేరు మీద.. అది ప్రేతం అన్నాగానీ, ఆత్మ శాంతి అన్నా గానీ, ఆయా పేర్లు , ఆయా కాలమాన పరిస్థితుల బట్టి పెట్టుకోనే అవకాశం ఉంది. అవసరార్ధం మార్చే చాన్స్ వెయ్యి శాతం ఉంది.

4.  ఇక గోవుకు పెట్టే పిండం.  సరే మనిషికి పెట్టారు, పక్షియైన కాకికి పెట్టారు. జలచరాలైన చేపలకి పెట్టారు,అదేరీతిలో జంతువైన  ఆవుకి పెట్టారు. అది కూడా ఆవుకి బలిష్టమైన ఆహారం మాత్రమే అనేది తెలుసుకోవాల్సిన విషయం.

  ఈ మధ్య  గో సేవా అంటూ గోవుల్ని ఆదుకుంటున్నాం అని చెబుతున్నవారు,  పిండాన్ని గోవులకి పెట్టనీయటం లేదనే విమర్శ కూడా ఉండి. అది చాలా తప్పు.. అపోహ కూడా.! ఆవుకి బలమైన ఆహారం అందించడమే పిండ ప్రదానంలోని గుణం.
(శాస్త్రం ప్రకారం కర్మకాండలో గోవుకు పిండ ప్రదానం నిషిద్దం కూడా.)

 ఇక పెడవాదులు వేసే మరో ప్రశ్న.. జంతువంటే గోవు మాత్రమేనా? ఇంకేం లేవా..? కుక్కకో పిల్లికో పెట్టొచ్చుకదా? కాకికే పెట్టాలా పిచ్చుకకో పిట్టకో పెట్టొచ్చు కదా..?

కావాలని ..అడగాలని అడిగే ప్రశ్నలకీ కూడా సమాధానాలు ఉంటాయ్. !!

    ఆవు ఎన్నో ఔషద గుణాలున్న మేలు జాతి పశువని గుర్తించారోయ్ మన పూర్వీకులు. అంతే కాదు ప్రతి ఇంటిలో కుక్క ఉన్నా, లేకున్నా ఆవు మాత్రం ఉండేది. అందుకే ఆ కాలం వారు సుభిక్షంగా ఉన్నారనడంలో సందేహం లేదు.  అన్నీ ఇళ్ళల్లో ఆవులుంటాయి కాబట్టి, వాటికి కూడా భోజనం పెట్టడమే ముఖ్యోద్దేశ్యం.  కాకికే కాదు గ్రద్దకూ పెట్టొచ్చని మంత్రం చెబుతోంది.
ఇందులో కూద మరొక గొప్ప మర్మం ఉంది కూడా.. ఎక్కడైతే కాకులు, లేదా గ్రద్దలు తిరుగు తుంటాయో.. అక్కడ విష జంతువులైన పాముల వంటి జీవులు సంచరించక పోవడం కూడా గమనించాలి.
ఇక ..
   ఆవులకు పెట్టె పిండాలలో పాలు పాల పదార్ధాలైనవి (నెయ్యి వంటీవి) కలవవు.     అలాగే చేపలకి పెట్టే పిండంలో మినుములు  ఉండవు.
    కాకులకి అంటే వాయసాలకి పెట్టే పిండంలో నెయ్యి,నువ్వులు ఉంటాయి. అవి బలమైన ఆహారం వాటికి.  అలా ప్రతిదీ ఆచి తూచి ప్రయోగాత్మకంగా విజయం సాధించి మాత్రమే చేశారు.

       కానీ అంతటీ గొప్ప సంస్కారవంతమైన గొప్ప ఆచారాన్ని కొనసాగించడానికి ఏదో ఒక పద్దతి వాడాలి కనుక.. అలా ఆదేశించారు. అందుకే ఇంతకాలం ఆ ఆచారాలు కొనసాగుతున్నాయ్.. ఈ రోజు ఏ చట్టం చేసినా వెంటనే తుంగలో తొక్కేస్తున్నారు..  ఆ దుస్థితి ఎందుకు దాపురించిందో   మన హేతు మేథావులు చెప్పాల్సిందే..!

  కొన్ని  మంచి విషయాలు పాటించడానికి  "భక్తి" అని చెప్పేరు. కొన్ని విషయాలను "ముక్తి " అని చెప్పారు.. అంతే..!
       మనం ఏ కళ్ళతో చూడాలో అవేకళ్ళు పెట్టుకు చూడాలి. దృష్టి లోపం లేనోడు  చత్వారం కళ్ళజోడు వాడితే నొప్పి ఖాయం.
      అలాగే హేతుబద్దంగా ఉన్న వాటిని జనవిజ్ఞానులు ఎందుకు చెప్పటం లేదో అర్ధం కావడం లేదు.
     వారు కేవలం వారికి తెలిసి గిరి గీసుకుని అదే ప్రపంచం అనే అపోహలో కొట్టు మిట్టాడుతున్నారో..  లేక  కేవలం హిందువుల సంస్కృతి సంప్రదాయాల మీద జరుగుతున్న దాడులో అర్ధం కాకుండా వుంది. మరి  దొంగ బాబాల తప్పులను ఎత్తి చూపిన జన మేథావులకి .. హైందవంలో మంచి కూడా ఉందన్న విజ్ఞానాన్ని ఎందుకు బోధించడంలేదో వెయ్యిడాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

జనులారా..! తస్మాత్ జాగ్రత్త..!!  జాతి నాశనానికి వీరే హేతువులు.

ఆఖరుగా మరొక్క విషయం.. ఏ ఒక్క ముద్దతోనో పేదవాడి కడుపు నిండదు. అది మన దగ్గర ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తూ పేదలను పోషిస్తున్నాం అని డప్పాలు పోయే ప్రభుత్వాలదని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వాలు 60 ఏళ్ళుగా ఏం ఉద్దరిస్తున్నాయో  నిలదీయాలి.

కొద్ది సేపటి క్రితం ఒకరు అడిగారు.. మరి ఒక్క పిండం గురించి ఇంత క్లాస్ చెప్పేరు కదా.. మరి వేల మంది పిండాలు పెడితే చాలా భోజనం వృధా కదా.. అని..!

" ఇంత చెప్పాక కూడా వక్ర బుద్ధి మారని వారి ని ఏమీ చేయలేము.. అందుకే వారికి నానుంచి  చిన్న ప్రశ్న.. అసలు మనం తింది మానేసి వారికే పెడితే దేశంలో పేద బలహీనులు వుండరు కదా?? అసలు మనం ఎందుకు తినాలి..?? వెంతనే మీరంతా తిండి మానేసి వారిని పేదల్ని పోషించండి.. ప్రభుత్వాలు మాత్రం దోచుకుని ఏళ్ళు పరిపాలిస్తాయ్.
                   
                             - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                               28.02.2015

మూఢాచారాలా..?? ఎలా?? - 1. ముండమోపి ఎదురైతే ఏంజరుగుతుంది...??

మూఢాచారాలా..?? ఎలా?? - 1
              - కళ్యాణ్ కృష్ణ కుమార్. కరణం, చీరాల

1. ముండమోపి ఎదురైతే ఏంజరుగుతుంది...??



                ఈ మధ్య సినిమాల్లో  ఒక కొత్త పోకడ మొదలైంది..   ఒకరి .. వెనుక ఒకరన్నట్లు.. దగ్గర దగ్గర ఒకే కథను అటు తిప్పి ఇటు తిప్పి తలోకటి చూపిస్తున్న్నరు.. హిందీ చిత్రాలు, తెలుగు, తమిళ చిత్రాలు.. ఒకటి కాదు అన్నీ భాషల్లో ఇదే లేటెస్ట్ ట్రెండ్.. స్వాముల్ని అడ్డం పెట్టూకుని ఒక మతాన్ని టార్గెట్ అవ్వచ్చు కాకపోవచ్చు కానీ మధ్య మధ్యలో ఒక డైలాగ్ ఇతర మతాల గురించి కూదా ఉండేలా జాగ్రత్త పడ్డారు కానీ..

ఇక్కడ మన చర్చనీయాంశమేమంటే.. వాళ్ళు ఏవి చూపిస్తున్నా.. వారడిగే వాటికి సమాధానం లేదా..? మన అనుకునే సంస్కృతికి విఘాతం జరుగుతున్నప్పుడు మనం అన్న మారాలి.. సమాధానం అన్న చెప్పి తీరాలి .. ఆవిధంగా ప్రయత్నంచాలన్నదే ఈ టపా ఉద్దేశ్యం.

 ఈ మధ్య ఓ చిత్రం చూశా..! మూఢాచారాలు మూఢ నమ్మకాలు అంటూ... సాగిందా చిత్రం.. ఆ తర్వాత దేవుడిని తెచ్చి ఏదో చెప్పించే ప్రయత్నం చేసినా  ఆ రచయిత ప్రశ్నలకు సమాధానం  ఇక్కడ ముఖ్యం..   అనవసరంగా కాలం మారినా వస్తున్న ఆచారాలైతే మానాల్సిందే..! మరి


సరే నేనే ఓ ప్రశ్న వేస్తున్నా??

ముండమోపి ఎదురైతే.. వచ్చిన నష్టమేంటి..??

ప్రశ్న రెండో సారి.. ముండమోపి ఎదురొస్తే ఏమౌతుంది...                                                            


ఇది మూఢాచారమా..! ఆచారమా??

నేను ఆనాటి మంచి ఆచారం అంటాను.

మనం అర్ధం చేసుకోవడంలో, పెడత్రోవ వల్ల కలిగిన నష్టం  నాస్తికుల చేతికి వరమైంది...

హిందూ ధర్మ సిద్దాంతాల్లో ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి .. పదుగురు ఆమోదించిన వాటినే  ...ఆచారాలుగా వ్యవహరించబడ్డాయని నేను నమ్ముతాను..  (ఆనాటి చట్టాలకు లోబడి కొన్ని ఉండొచ్చు .. అలాంటివి రూపుమాపాలి..నేటి చట్టాలకు లోబడి .. పరిస్థితులకు లోబడి మారాల్సి ఉంది.. దీనిలో ఏమాత్రం డిస్కషన్స్ లేవు )

 కానీ అన్నీ మూఢాచారాలు కావు.. వాటికి అప్పటి కాల మాన పరిస్థితులు.. మాత్రమే కారణం.

సరే ప్రశ్న మరోసారి క్షుణ్ణంగా పరిశీలీంచండి

"ముండమోపి ఎదురొస్తే నష్టం ఏంటి..?"
ఇదిగో అదే ప్రశ్న మరలా ఇక్కడే జాగ్రత్త...

" ముండమోపికి మనం ఎందుకు ఎదురెళ్ళకూడదు.?" ఇదీ వెయ్యల్సిన ప్రశ్న..

"అవును.. ఆ మహా తల్లికి మనం అనే వెధవలం ఎదురెళ్ళకూడదు కానీ.. ఆమె మనకి ఎదురు రావచ్చు.. ఇదీ నా సమాధానం.."

కారణం కుడా చెప్పాలి కదా.. ఇదిగో చెబుతున్నా..."

1.ఇదివరలో మన సంస్కృతి ప్రకారం స్త్రీకి చిన్ననాటే వివాహం చేసేవారు..

2. స్త్రీ భర్త వయసు రీత్యా చాలా పెద్దవారు అయ్యే అవకాశమే అధికం.

3. సదరు భర్త చనిపోయినప్పుడు ఆమెకు శిరోముడనం చేసి తెల్ల చీరెకట్టే వారు.. భర్త పోయిందన్న విషయానికి గుర్తయి ఉండొచ్చు.( ఈ ఆచారం ఇప్పుడు లేదు.. మంచి పరిణామం)

4. సదరు స్త్రీ చిన్న వయస్సులోనే భర్త ను పోగొకుని పుట్టెడు దుఖం తో ఉండి భర్త కోసం సాధ్విలా తపిస్తూ.. నిత్యం రోదిస్తున్న సమయంలో ఒక అందమైన జంట.. మరింత అందం గ ముస్తాబై  ఆమె కి ఎదురొస్తే..
5.అమెకి తన కొద్ది రోజుల క్రితమే వివాహమై తన్ జీవిత భాగస్వామి గుర్తొస్తే..
6. ఆమె మనసు మరింత క్షోభిస్తుందనేది ఎవ్వరైనా ఇట్టే చెప్పొచ్చు. అవునా కదా..?

    అందుకే ఆమెకి మనం ఎదురెళ్ళకూడదన్నరు కానీ.. ఆమె రావటం వల్ల మనకే ప్రమాదమూ లేదని గుర్తుంచుకోండి..
మనం చేసే పిచ్చి చేష్టలకి .. తెలియని తనానికి మన పూర్వీకులుచెప్పిన జాగ్రత్తలు అనవసరంగా ప్రక్కదోవపట్టడం వల్ల అంతటి మహానుభావులకి చెడ్డపేరు తేవడం తప్ప వేరొకటి కాదు.. దయచేసి  ఇలాంటి చక్కటి హైందవా ఆచారాల అసలు విషయాల గుట్టు  విప్పే  ప్రయత్నంలో మీరూ భాగస్వాములు కండి.. మీ ఆలోచనలను నాతో పంచుకోండి.. మీ కేదన్నా ఆచారవ్యవహారాల మీద ఇలాంటి దృష్టికోణం ఉంటే తెలియచేయండి.. నాకు పర్సనల్ గా ఐనా మెసేజ్ చెయ్యండి. మరి కొన్నిటి పై త్వరలో చర్చిద్దాం.

                                             -          మీ కళ్యాణ్ కృష్ణ కుమార్. కరణం, చీరాల
                                                                                                20.01.2015

                   
https://www.youtube.com/watch?v=BCknHCgKmTg

Wednesday 25 February 2015

దేశం లోనే గొప్ప ఆలయం ఇదేనేమో..?

     ఎంతో విశాల దృక్పధానికి ఆలవాలమైన ఈ ఆలయం ని దర్శించుకున్న వాళ్ళేవరన్నా ఉంటే వారి కాళ్ళు మ్రొక్కాలని వుంది.
ఇంతకీ ఇదేం ఆలయమో ఎవరైనా చెబుతారా?? 







గుర్తుపట్టారా?

??

???

???

????

?????
ఇది దేవాలయం అనుకుంటే అడుసు తొక్కినట్లే.. అంతకన్న పవిత్రమైనదే మరి..??

.....
.....

......


....

....

.........

ఇది ఒక ముద్రణాలయం...

*************
******************
***********************
*****************************
***********************
******************
*************








        భారతీయత.. భారతదేశ ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతూ... కేవలం భారతీయ సంస్కృతి పరిరక్షణ కోసం స్థాపించబడి 92 ఏళ్ళు గా అవిరళ కృషి చేస్తున్న ధార్మిక సంస్థ గీతా ప్రెస్. ప్రపంచంలో అత్యధికంగా హిందూ సంబంధమైన పుస్తకాలు అనేక భాషల్లో అతి తక్కువ ధరకే అందిస్తున్న సంస్థ ఇది. నిజంగా దేవాలయాన్ని తలపిస్తున్న ఈ గీతా ప్రెస్ 1923 ఏప్రియల్ 29 న జయదయాళ్ గోయంక ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో స్థాపించారు. వీరి ఆధ్వర్యంలో గీతాప్రెస్, గోవిందభవన్ ,  గీతా భవన్, వేదపాఠశాల, ఆయుర్వేదిక్ ఔషదాలయ  సేవాదళ్ వంటి సంస్థలు ద్వారా అనేక ప్రాంతాలలో   హిందూ సంస్కృతికి కృషిచేస్తూ.. సనాతన ధర్మాల ఉనికిని కాపాడుతున్నారు. గీతా ప్రెస్ నుంచి పలు భాషల్లో వస్తున్న 'కళ్యాణ్ ' అనే పత్రికకు లైఫ్ టైం ఎడిటర్ గా తొలి ఎడిటర్ హనుమాన్ ప్రసాద్ పొద్దార్ గారి పేరే కొనసాగుతుంది. శ్రీమద్భగవద్గీత, రామాయణం, దుర్గా సప్తసతి, పురాణ , ఉపనిషత్తుల వంటి పుస్తకాలు ఇప్పటి వరకూ 370 మిలియన్ కాపీలను ఈ సంస్థ ప్రచురించింది. అయినా సరైన గుర్తింపుకు నోచుకోక పోవడం దురదృష్టం కదా..//

నమోస్తు గీతా ప్రెస్
నమోనమ: గీతాప్రెస్
నిత్య సేవికా వందనం
నిరంతర శ్రామికాభివందనం

               - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                           26.02.2015

Tuesday 24 February 2015

స్వరములు ఏడు.. మరి....రాగాలెన్నో తెలుసా..?

స్వరములు ఏడు.. మరి....రాగాలెన్నో తెలుసా..? 
                                               - - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                                                         24.02.2015 


అవి చతుర్వింశతి రాగాలు .. అంటే  24  అన్నమాట. అవికూడా స్త్రీ రాగాలు


1. బిలహరి రాగము    
2. భాండి రాగము
3. హితదో రాగము
4. భల్లాతి రాగము
5. దేశి రాగము    

6. లలిత రాగము
7. వరాళి రాగము
8. గౌళ రాగము
9. ఘూర్జర రాగము
10. జౌళి రాగము
11. కళ్యాణి రాగము
12. అహిరి రాగము

 
13. సావేరి రాగము
14. దేవక్రియ రాగము
15. మేఘరంజి రాగము
16. కురంజి రాగము
17. మళహరి రాగము
18. కాంభోజి రాగము
19. నాహుళి రాగము
20. ముఖారి రాగము
21. రామక్రియ రాగము
22. గండక్రియ రాగము
23. ఘంటారవ  రాగము
24. శంకరాభరణ రాగము


         ఇన్ని రాగాల్లో నాకు మాత్రం ఒక్క రాగమూ రాదు .. నాకొచ్చిన రాగం వీటిలో లేదు .. ఏంచెయ్యలి చెప్మా..? అది ఏమి రాగమో చెప్మా..? అన్నట్లు ఇవన్నీ స్త్రీ రాగాలైతే పురషరాగాలేవిటి?? ఏవిటో అప్పట్లో అంతా పురుషాహంకారులన్నారు గానీ వాళ్ళూ స్త్రీ పక్షపాతులేనండోయ్..

Thursday 19 February 2015

ఒకరెంట మరొకరు

//ఒకరెంట మరొకరు//
                                                                    - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                                                   19.02.2015






పోండి..అందరూ వెళ్ళిపోండి.
మమ్మల్ని ఏకాకుల్ని చేసి..
మా అంతరాల్ని మీ రూపంతో నింపేసి





మీరు గీసిన గీతల్లో
మీరు వ్రాసిన మాటల్లో
మీరు తీసిన చిత్రాల్లో
మిమ్మల్ని చూసుకోమంటూ..
ఒక్కొక్కరుగా వెళ్ళిపోండి..



మీభావాల రెక్కలేరుకుని
సిగన పెట్టుకుంటాం
పుస్తకాల నడుమ నెమలీక బదులో
మనసులో ప్రేమమూర్తి బదులో
మది దేవళంలో దేవతల బదులో
మిమ్ము పదిలంగా దాచుకుంటాం..


నిత్యం అభిమానపు పూలు
మాలగ జేసి అర్చించుకుంటాం..

మీరు లేరన్నది ఒట్టి భౌతికం..
మీ జ్ఞాపకం శాశ్వతం..

మీరు ఆకాశాన నిత్యం మెరిసే
నక్షత్రం..
ఒకరినొదిలి ఉండలేక
మరొకరు..
వరుసగా
ఒక్కొక్కరుగా..!!!

 






(మనసు భారమౌతోంది.. బాలచందర్ , అక్కినేని, దగ్గుబాటి సినీదిగ్గజాలు. బాపు..రాగతిపండరి వంటి ఉద్దండ కార్టూనిస్టులు.. . అందరూ ఒకరెంట మరొకరుగా... అడుగులోన అడుగేసుకుంటూ...కన్నీళ్ళు మిగిల్చి)