Tuesday 3 March 2015

మూఢాచారాలా..?? ఎలా??-2..పిండం పెట్టడం ఎందుకు..??

మూఢాచారాలా..?? ఎలా?? 
           - కళ్యాణ్ కృష్ణ కుమార్. కరణం, చీరాల

2.  పిండం పెట్టడం ఎందుకు..??

 "యావత్ పిండ మనుష్యాని
గంగా తోయేషు తిష్టతి
తావద్ వర్ష సహస్రాణి
స్వర్గలోకే మహీయతే..!"

(ఎవరిని ఉద్దేసించి నీటిలో పిండ ప్రదానం జరుగుతుందో వారికి వేయి వత్సరాలు స్వర్గలోక ప్రాప్తి.)

ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళకీ హైందవం అంటే చిన్నచూపు.. వ్యంగ్య భావన ఎక్కువయ్యాయ్ . దానికి కారణమూ లేకపోలేదు..

1. ముందుతరం, తరువాత తరానికి అందించాల్సిన స్థాయిలో జ్ఞానం అందించక పోవటం..

2. జ్ఞానం అందించే స్థానంలో ఉన్నవారు, సంపూర్ణంగా చెప్పలేకపోవటం,

3. చెప్పగలిగేవారు సంపూర్ణంగా లేకపోవటం .

4. అసలేమిటీ ఇందులో మర్మం అని తెలుసుకునే ప్రయత్నం చేసేవారు మృగ్యమవడం.

5. ఎవరేది అంటే అది నిజమే అన్నట్లు తలూపడం, నిజమని భ్రమలోకి జారుకోవటం.

 6. అర్ధమయ్యే రీతిలో చెప్పినా అర్ధం చేసుకోలేని అజ్ఞానంలో ఉండటం
7. సంస్కృతం , ప్రాకృతం వంటి బాషలు కనుమరుగవడం.

8. జాతి నాశనానికి కొందరు పాలకులు చేసిన కుట్రలో భాగంగా సంస్కృతి, సంస్కృతం మూలాలు నాశనమొనరించడం.

9. హేతు వాద తత్వం.. ఇతర మతాల సంస్కృతి దాడులు.. మొదలైనవి ఎన్నో వున్నాయ్. వాటి గురించి  ఆలోచిస్తుంటే అనంతాలేమో అనిపిస్తుంది.

కాయలున్న చెట్టుకే రాళ్ళు :

.. కాయలున్న చెట్టుకే దెబ్బలు .. కదా..! ఎన్నో ఫలాలిచ్చే హైందవ చెట్టుకే  రాళ్ల దెబ్బలు.. హేతు బద్దంగా సమీక్షిస్తే హైందవం మొత్తం సైన్స్ నిండి ఉండన్న సత్యం.. నాస్తిక శిఖామణులకి, హేతువాదులకి, ఇతర మతస్తులకీ మింగుడు పడని నిజం.

  అరే  విదేశీయులు గుర్తిస్తున్నార్రా..! అని మొత్తుకున్నా.. ఇక్కడ పుట్టిన కొందరు మూర్ఖులకు చెవికెక్కదు. అందుకేనేమో "మొండివాడు రాజుకన్న బలవంతుడ"న్నారు పెద్దలు.

ఇక అసలు విషయానికి వద్దాం.. పిండం పెట్టడం అనవసరమా..? (ఇటీ వల ఒక చిత్రం లో ఒకానొక సందర్భంలో వేసిన ప్రశ్న ఇది.)

    కొందరు ప్రబుద్దులు.. వారి సూక్ష్మ బుద్ధికి పదును పెట్టి వేసిన ప్రశ్న.. ఇది.. ఇప్పుడు నాస్తిక, హేతువాద,  పరమతస్థులకు ఒక సాకుగా దొరికింది..

ప్రశ్న : " పిండం అంటూ నీళ్లలో వేసే అన్నం ముద్ద మరొక పేదవాడికి  కడుపు నింపుతుంది  కదా..?"

"శెభాష్.. నిజమే" అనిపిస్తోంది కదూ..??

మరి ఆ అభిప్రాయం నిజమా? అంటే,  ఆ భావన 100శాతం తప్పు .!

మరి ఎందుకో తెలుసుకోవాల్సిన బాధ్యత మనమీదుందని గుర్తించాలి. అందుకే ఎందుకో ఇప్పుడు తెలుసుకే ప్రయత్నం చేద్దాం.

     

పిండం  : ఇవి పలు రకాలు.. కర్మకాండలకు , రకరకాల పిండాలు పెట్టడం హిందూ సంస్కృతిలో ఉంది.. కొందరు మాత్రమే పాటిస్తున్నారు.. కొందరు రాను రాను విసర్జించి ఉంటారు. కొందరు తొలినాళ్ళ నుంచి పాటించి ఉండక పోవచ్చు.

ఈ ప్రశ్న కు సమాధానం చూసే ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

విశ్వంలో మనిషి మాత్రమే ఉన్నాడా??  ప్రాణంతో ఉన్న ఇతర జాతులేమీ లేవా?

మీరనే సైన్సే ఏమి చెబుతోందో తెలుసా..!??
     
8.7 మిలియన్ల జీవరాశులు భూమిమీద జీవిస్తున్నాయని సైన్స్ పత్రిక చెబుతోంది. ఇంకా కూడా ఎక్కువే ఉండొచ్చుకూడా.

ఇక భారతదేశం కి వస్తే అవి కూడా ఖచ్చితంగా లక్షల సంఖ్యల్లోనే ఉంటాయి.

       అందరికన్న మేథస్సున్న మానవుడు మూఢాచారాలు నమ్మొచ్చా?  అనే వాదం ఉన్నవారికి,  మరి ఆయా ఇతర  జీవులు ఎలా జీవిస్తాయో అన్న అనుమానం ఎందుకు కలుగట్లేదో అర్ధం కాని ప్రశ్న.

మన కడుపుకి తింటే చాలా..??

    ఒక గిరి గీసుకుని అందులో మఠం వేసుకు కూర్చుని, ఎదుటి వారిమీద దుమ్మెత్తి పోయటం చాలా సులభమే..! కానీ గతించిన మంచోళ్ళు అలా చేయలేదు.. పూర్వీకులు అన్నింటి గురించీ పట్టించుకున్నారు. అన్ని ప్రాణుల అవసరాలనీ ఏదో ఒక రూపంలో తీర్చాలన్న నీతి ని ప్రభోదించారు..

అందులో భాగమే ఈ పిండ ప్రదానం,తర్పణం అనే కార్యక్రమం లేదా క్రతువు.

ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు కాలం చేసినప్పుడు పిండం పెట్టడం ఆచారం..

  శాస్త్రంలో మంత్ర విధానంగా  ..
"ఇదం పిండంగృధ్ర వాయస, జలచర ముఖేన ప్రేత భుజ్యతాం"
(గద్దలు, కాకులు, జలచరాలు రూపంలో  పిత్రుదేవతలకు ఆహారం అందించాలి)

1. కాలం చేసిన వారి పేరుతో , వారిని గుర్తుంచుకోవాలనే ఉద్దేశ్యంతో (ఆత్మ శాంతి కోసం) ఊరి జనం మొత్త్తాన్ని పిలిచి స్థోమతకు తగ్గట్టు అన్నదానం చేస్తారు. ఇది బ్రాహ్మణ , బ్రాహ్మణేతరులకు కూడా అన్నదానం జరుగుతుంది. కాబట్టి మనుష్య జాతికి భోజనం పెట్టారు ఆ కుటుంబం వాళ్ళూ.

2. వాయస పిండం (కాకి కి పిండం) :
       "కాకులు దూరని కారడవి అంటారు." ఈ ఉపమానం ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. అంటే కాకి ఎక్కువగా కనిపించే పక్షి జాతి కి చెందిన జీవి. (క్రతువు ఎప్పుడు, ఎక్కడ,మాసికమా, ఏడూడా అనేది మాత్రం ఇక్కడి సమస్యకాదని పురహితులు గుర్తించాలి.) ఆ పక్షిజాతికి భోజనం పెట్టడం అనేది అందులో పరమార్ధం .
నువ్వులు, అన్నం,నెయ్యి కలిపిన ముద్ద పెడతారు.
అంతే ఇక్కడ కాకి తినే పదార్ధాలనే ఉపయోగిస్తారనేది గ్రహించాలి.

3. వికిర పిండం /నీటిలో వదిలే పిండం:  ఇక ఈ పాటికే మీకు సమస్యకు సమాధానం  అర్ధం అయి ఉంటుందనుకుంటున్నా..! కానీ మన హేతువాద సోదరులకి హేతుబద్ధంగా చెప్పాలనేదే ఈ ప్రయత్నం.!
   నీటిలో అనేక జీవజాతులున్నయ్. మనిషి కన్న ముందు పుట్టిన మత్స్యజాతి  ఉంటుంది. ఆ చేపలకు ఆహారమే నీటి లో వదిలే పిండం.

    మనిషికి , పక్షిజాతికి, జలచరాలకీ కూడా ఆహారం అందిస్తున్నారు.. అది కూడా చనిపోయిన వారి పేరు మీద.. అది ప్రేతం అన్నాగానీ, ఆత్మ శాంతి అన్నా గానీ, ఆయా పేర్లు , ఆయా కాలమాన పరిస్థితుల బట్టి పెట్టుకోనే అవకాశం ఉంది. అవసరార్ధం మార్చే చాన్స్ వెయ్యి శాతం ఉంది.

4.  ఇక గోవుకు పెట్టే పిండం.  సరే మనిషికి పెట్టారు, పక్షియైన కాకికి పెట్టారు. జలచరాలైన చేపలకి పెట్టారు,అదేరీతిలో జంతువైన  ఆవుకి పెట్టారు. అది కూడా ఆవుకి బలిష్టమైన ఆహారం మాత్రమే అనేది తెలుసుకోవాల్సిన విషయం.

  ఈ మధ్య  గో సేవా అంటూ గోవుల్ని ఆదుకుంటున్నాం అని చెబుతున్నవారు,  పిండాన్ని గోవులకి పెట్టనీయటం లేదనే విమర్శ కూడా ఉండి. అది చాలా తప్పు.. అపోహ కూడా.! ఆవుకి బలమైన ఆహారం అందించడమే పిండ ప్రదానంలోని గుణం.
(శాస్త్రం ప్రకారం కర్మకాండలో గోవుకు పిండ ప్రదానం నిషిద్దం కూడా.)

 ఇక పెడవాదులు వేసే మరో ప్రశ్న.. జంతువంటే గోవు మాత్రమేనా? ఇంకేం లేవా..? కుక్కకో పిల్లికో పెట్టొచ్చుకదా? కాకికే పెట్టాలా పిచ్చుకకో పిట్టకో పెట్టొచ్చు కదా..?

కావాలని ..అడగాలని అడిగే ప్రశ్నలకీ కూడా సమాధానాలు ఉంటాయ్. !!

    ఆవు ఎన్నో ఔషద గుణాలున్న మేలు జాతి పశువని గుర్తించారోయ్ మన పూర్వీకులు. అంతే కాదు ప్రతి ఇంటిలో కుక్క ఉన్నా, లేకున్నా ఆవు మాత్రం ఉండేది. అందుకే ఆ కాలం వారు సుభిక్షంగా ఉన్నారనడంలో సందేహం లేదు.  అన్నీ ఇళ్ళల్లో ఆవులుంటాయి కాబట్టి, వాటికి కూడా భోజనం పెట్టడమే ముఖ్యోద్దేశ్యం.  కాకికే కాదు గ్రద్దకూ పెట్టొచ్చని మంత్రం చెబుతోంది.
ఇందులో కూద మరొక గొప్ప మర్మం ఉంది కూడా.. ఎక్కడైతే కాకులు, లేదా గ్రద్దలు తిరుగు తుంటాయో.. అక్కడ విష జంతువులైన పాముల వంటి జీవులు సంచరించక పోవడం కూడా గమనించాలి.
ఇక ..
   ఆవులకు పెట్టె పిండాలలో పాలు పాల పదార్ధాలైనవి (నెయ్యి వంటీవి) కలవవు.     అలాగే చేపలకి పెట్టే పిండంలో మినుములు  ఉండవు.
    కాకులకి అంటే వాయసాలకి పెట్టే పిండంలో నెయ్యి,నువ్వులు ఉంటాయి. అవి బలమైన ఆహారం వాటికి.  అలా ప్రతిదీ ఆచి తూచి ప్రయోగాత్మకంగా విజయం సాధించి మాత్రమే చేశారు.

       కానీ అంతటీ గొప్ప సంస్కారవంతమైన గొప్ప ఆచారాన్ని కొనసాగించడానికి ఏదో ఒక పద్దతి వాడాలి కనుక.. అలా ఆదేశించారు. అందుకే ఇంతకాలం ఆ ఆచారాలు కొనసాగుతున్నాయ్.. ఈ రోజు ఏ చట్టం చేసినా వెంటనే తుంగలో తొక్కేస్తున్నారు..  ఆ దుస్థితి ఎందుకు దాపురించిందో   మన హేతు మేథావులు చెప్పాల్సిందే..!

  కొన్ని  మంచి విషయాలు పాటించడానికి  "భక్తి" అని చెప్పేరు. కొన్ని విషయాలను "ముక్తి " అని చెప్పారు.. అంతే..!
       మనం ఏ కళ్ళతో చూడాలో అవేకళ్ళు పెట్టుకు చూడాలి. దృష్టి లోపం లేనోడు  చత్వారం కళ్ళజోడు వాడితే నొప్పి ఖాయం.
      అలాగే హేతుబద్దంగా ఉన్న వాటిని జనవిజ్ఞానులు ఎందుకు చెప్పటం లేదో అర్ధం కావడం లేదు.
     వారు కేవలం వారికి తెలిసి గిరి గీసుకుని అదే ప్రపంచం అనే అపోహలో కొట్టు మిట్టాడుతున్నారో..  లేక  కేవలం హిందువుల సంస్కృతి సంప్రదాయాల మీద జరుగుతున్న దాడులో అర్ధం కాకుండా వుంది. మరి  దొంగ బాబాల తప్పులను ఎత్తి చూపిన జన మేథావులకి .. హైందవంలో మంచి కూడా ఉందన్న విజ్ఞానాన్ని ఎందుకు బోధించడంలేదో వెయ్యిడాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

జనులారా..! తస్మాత్ జాగ్రత్త..!!  జాతి నాశనానికి వీరే హేతువులు.

ఆఖరుగా మరొక్క విషయం.. ఏ ఒక్క ముద్దతోనో పేదవాడి కడుపు నిండదు. అది మన దగ్గర ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తూ పేదలను పోషిస్తున్నాం అని డప్పాలు పోయే ప్రభుత్వాలదని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వాలు 60 ఏళ్ళుగా ఏం ఉద్దరిస్తున్నాయో  నిలదీయాలి.

కొద్ది సేపటి క్రితం ఒకరు అడిగారు.. మరి ఒక్క పిండం గురించి ఇంత క్లాస్ చెప్పేరు కదా.. మరి వేల మంది పిండాలు పెడితే చాలా భోజనం వృధా కదా.. అని..!

" ఇంత చెప్పాక కూడా వక్ర బుద్ధి మారని వారి ని ఏమీ చేయలేము.. అందుకే వారికి నానుంచి  చిన్న ప్రశ్న.. అసలు మనం తింది మానేసి వారికే పెడితే దేశంలో పేద బలహీనులు వుండరు కదా?? అసలు మనం ఎందుకు తినాలి..?? వెంతనే మీరంతా తిండి మానేసి వారిని పేదల్ని పోషించండి.. ప్రభుత్వాలు మాత్రం దోచుకుని ఏళ్ళు పరిపాలిస్తాయ్.
                   
                             - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                               28.02.2015

No comments:

Post a Comment