Sunday 22 March 2015

శ్రీరాముడికి సోదరి ఉందని తెలుసా..??

శ్రీరాముడికి సోదరి ఉందని తెలుసా..??

                   - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                      22.03.2015

దశరధునికి భార్యలు మువ్వురు కౌసల్య సుమిత్ర కైకేయి..

ధసరధునికి  పుత్రులు నల్గురు.. రామలక్ష్మణభరత శతృఘ్నులు.. అదే కదా మనకి తెలిసింది.. మరి శ్రీరామునికి సోదరి కూడా ఉందని తెలుసా..?

 సోదరి అంటే పెద్దదా చిన్నదా? అంటే అక్క?? చెల్లెలా??

ఉంటే ముగ్గురు భార్య లో ఎవరు కన్నారు??  ఆమె ప్రస్తావన ఎక్కడా ఎందుకు కనబడలేదు..? ఉంటే ఆమె పేరేమిటి?? ఇత్యాది అనుమానాలు టక టక మీ మనసు రామాయణాన్ని శోధిస్తోంది కదూ../ విచిత్ర రామాయణంలో ఆమె ప్రస్తావన ఉంది.

ఆమె పేరు శాంత.

శాంత గురించి పెద్దగా మనకు తెలీదు..

ఈ శాంత గురించి కాస్త మనమూ తెలుసుకుని .. భవిష్యత్తుకూ అందించాల్సిన బాధ్యత ఉందనిపిస్తోంది..

శాంత కథ  తెలుసుకుందామా..?



శ్రీరాముడు ఇత్యాదులు పుట్టక మునుపు ధశరధునికి సురభి అనుగ్రహంతో పుట్టిన కుమార్తె శాంత..

    దశరధుని స్నేహితుడైన  అంగరాజ్యాధిపతి రోమపాదుడి కి పిల్లలు లేకపోవడంతో శాంత ను అక్కడ పెంచే ఏర్పాటు చేశారు. కొందరి వివరాల ప్రకారం ఆరునెలలు రోమపాదుడి ఇంట అంగరాజ్యంలో , మరో ఆరునెలలు దశరధుని ఇంట అయోధ్యలో  పెరిగేది శాంత.

 యుక్తవయస్కురాలైన తర్వాత  ఆమెకి దశారధుడు స్వయంవరం ప్రకటిస్తే.. ఆగ్రహంతో రాజప్రాసాదం చేరుకున్న  పరుశరాముడు , శాంత వివాహాన్ని అడ్డుకునేందుకు  దశరధుని పై కత్తి దుశాడు.  వశిష్టుడు అడ్డుపడి పరుశరాముని శాంతిబరచి, అనంతరం .. పరుశరాముని ఆదేశం ( బ్రాహ్మణునికిచ్చి చేయమని) మేరకు ఋష్యశృంగ మహర్షికి ఇచ్చి వివాహం  చేయడం జరిగింది..  శ్రీరామాదులు జన్మించడానికి కారణమైన పుత్రకామేష్టి యాగమును దశరథునిచేత చేయించినది ఈ ఋష్యశృంగుడే!  కాబట్టి  శ్రీరామాదుల న్వంత అక్క గారే..శాంత.

 దీనికి ఆధారాలుగా జానపదం లో శాంత ప్రస్తావన ఉంది. శ్రీ సత్యనారాయణ పిస్కావారు తన్ బ్లాగ్ లో అందించిన ఓ జాణపదంలో శాంత ప్రస్తావన కనబడింది.. ( http://andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=238&PageNum=4 )

      శాంత :

       " అక్కచెల్లెండ్రు మీరూ మిక్కిలీ సౌందర్యశాలులమ్మా
        మా తమ్ములు నలుగురినీ వలపించు జాణలకు దౄష్టి తగులూ
        దృష్టి తగులాకుండనూ నీలాల నివ్వాళులివ్వరమ్మా


         (అని సీతమ్మకే మారు వడ్డించింది. గడసరి సీతమ్మ ఊరుకుంటుందా!)


        మాయన్న ఋష్యశృంగూ వనములో కూడి యెడబాయకున్నా
        ఏమి యెరుగని తపసినీ ఓ వదినె! కేళించి విడిచినావూ
        దృష్టి తగులాకుండనూ నీలాల నివ్వాళులివ్వరమ్మా "

ఈ రెండు పాదాలు శ్రీరాం సోదరులకు అక్క ఉన్నదని ఖచితంగా రూఢి చేస్తున్నాయ్.. కాగా ఆమె భర్త ఋష్యశృంగుడనీ ఖరారు చేస్తున్నాయ్.



 

"లవకుశ" సినిమాలో శాంతాదేవి పాత్ర ఉంది. గుర్తొచ్చిందా..? . ఆ పాత్రను అలనాటి నటి సంధ్య (తమిళనాడు మాజీముఖ్యమంత్రి జయలలిత  కన్నతల్లి) పోషించారు.   
  వీలైతే "లవకుశ" మళ్ళీ చూడండి. ఇక, శాంత వివాహవృత్తాంతం పాతచిత్రం "ఋష్యశృంగ" లో చూడవచ్చును. అలనాటి నటుడు ముక్కామల కృష్ణమూర్తి ఈ చిత్రమును నిర్మించారు. అందులో ఋష్యశృంగునిగా అందాలనటుడు హరనాథ్ నటించారు. శాంతగా ఆశాలత అనే నటి వేసింది. ఇంకా రాజసులోచన, ముక్కామల వగైరాలు నటించారు.


కాబట్టి మిత్రులారా..! దశరధునికి పిల్లలు ఐదుగురు..  శ్రీరామ సోదరుల ఏకైక సోదరి శాంతాదేవి.

Saturday 21 March 2015

ఉగాది తెలుగు వారిది మాత్రమేనా..??

ఉగాది తెలుగు వారిది మాత్రమేనా..?? 
                        - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                           31.03.2014

లేలేత కిరణాలు...
వీడని మంచు తెరలు..
రాలిన సుమాలు..
కోయిల కేరింతలు..
కొత్త చివురులు..
చిలక పలుకులు....
మామిడి రుచులు..
ప్రకృతి రమణియతను ఇంత అందంగా కళ్లకు కట్టేది.. వసంత రుతువు.

ఒక సారి ఋతువులను తెలుసుకుందాం :

౧. వసంత రుతువు
౨. గ్రీష్మ రుతువు
౩. వర్ష రుతువు
౪. శరద్ రుతువు / శరదృతువు
౫. హేమంత రుతువు
౬. శిశిర రుతువు

రుతువులలో ..తొలి ఋతువు వసంతం.. వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం..తొలి పక్షం శుక్లం.. అందులో తొలి రోజు పాడ్యమి.. ఆ రోజే ఉగాది..

సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి సంక్రమణ సమయంలోని చంద్రోదయం తదుపరి ఉగాది అని చెప్పటం జరుగుతోంది.

అసలు ఉగాది నేపథ్యం చూద్దాం..!

ఉగాది సంస్కృతం నుంచి వచ్చిన పదం. యుగ+ఆది
యుగ అనగా కాలం / వయస్సు అని అర్ధాలున్నాయి.(ఇంకా అనేకం వున్నాయు.), ఆది అనగా మొదలు అని అర్ధం.
శ్లో : యస్మిన్ కృష్ణో దివంవ్యత:
తస్మత్ ఏవ ప్రతిపన్నం కలియుగం                   



అని మహర్ష వేదవ్యాసుల వారు కలియుగారంభం గురించి ప్రకటించారు. అంటే ద్వాపర యుగం అంతంలోకృష్ణుడు ప్రపంచాన్ని విడిచి వెళ్ళిన నాటి నుండి.. కలియుగం ఆరంభం ఆయినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. కృష్ణుడు తన అవతారం చాలించిన తదుపరి బ్రహ్మ కలియుగ సృష్టిని ఆరంభించిన రోజునే యుగాది అంటారని కూడా తెలుస్తోంది.

సుమారు క్రీ.పూ. 3012 ఫిబ్రవరి 17/18 అర్ధరాత్రి నుంచి కలియుగం ఆరంభమై వుండవచ్చని గణిత శాస్త్రజ్ఞుల అంచనా..!
ఇక ఖగోళ ,గణిత శాస్త్ర కోవిదుడు అయిన భాస్కరాచార్య.. 12వ శతాబ్ధంలో యుగాది ఆరంభం గురించి ఇలా చెప్పారు.

" చెట్లకు ఆకురాలి, తిరిగి ఆకు చిగురించు కాలాన్ని.. తొలి ఋతువుగా.. కొత్తనెల ,కొత్త పక్షం, కొత్త ఘడియలను.. దక్షిణం నుంచి ఉత్తరానికి రవి సంక్రమణ సమయంలో చంద్రోదయం వెంట వచ్చే తొలి ఘడియల నుంచి ఉగాది ప్రారంభం అయినట్లు భాస్కరాచార్య.. లెక్కలు గట్టారు. దీంతో ల్యూనార్ క్యాలెండర్ (భారతీయ పంచాంగం..)చంద్రమాన పంచాంగం ప్రకారం నూతన సంవత్సరం.. చైత్రమాసం శుక్ల శుద్ధపాడ్యమి రోజు ప్రారంభమౌతుందన్నమాట.

శాలివాహన శకం ఆధారంగా మన పంచాంగం (కాలెండర్) రూపొందించ బడింది. గౌతమీ పుత్రశాతకర్ణి ఆయిన శాలివాహనుడు ఆయన హయాంలో భారతీయ పంచాంగం రూపొందింపజేశారు. అనాటి నుండి కాల నిర్ణయం చేసి రూపొందించడం వల్ల అది శాలివాహన శకం గా పేర్కొనబడింది. ఆంగ్ల గ్రెగోరియన్ కాలెండర్ కు భారతీయ పంచంగం (ల్యునార్ క్యాలెండర్ కు 78 ఏళ్ళ తేడా ఉంటుంది. అంటే గ్రెగోరియన్ కాలెండర్ ప్రకారం 2014 అయితే.. శాలివాహన శకం ప్రకారం 1936 వ సంవత్సరం నడుస్తుందన్నమాట.! శాలివాహన శకం పంచాంగం ప్రకారం.. ప్రతి 60 ఏళ్ళు తిరిగి వస్తాయి. మొదట ప్రభవ నామ సం వత్సరంతో మొదలై 60 పూర్తి చేసుకుని మరలా ప్రభవ నామ వత్సరం వస్తుందన్నమాట.! గ్రెగోరియన్ లేదా హూణ లేదా ఆంగ్ల కాలెండర్ ప్రకారం మార్చ్ నెలాఖరు లేదా ఏప్రియల్ తొలివారాలలో ఈ ఉగాది పర్వదినం వస్తుంది.

అరవై సంవత్సరాలు..
1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాథి, 14. విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవలంభి, 32. విలంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృత్, 37. శోభకృత్, 38. క్రోధి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృత్, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్త, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ.






ఈ ఉగాదిని ముఖ్యంగా వింధ్యపర్వతాలు, కావేరీ మధ్యనున్న దక్షిణభారతీయులు జరుపుకుంటారు.. వీరు మాతమే కాక ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలోని హైందవ సంప్రదాయం పాటించే వారు,వందల ఏళ్లక్రితం స్థిర నివాసాలేర్పరచుకున్న హైందవ సంచార జాతులు ఒకే రోజున ఉగాదిని జరుపుకుంటారు. అంతే కాక మరి కొన్ని రాష్ట్రాలలో కొద్ది రోజుల తేడాతో ఉగాది జరుపుకోవటం కద్దు.

తెలుగు - ఉగాది
కన్నడ - యుగాది
కొంకణి/మరాఠి - గుడిపాడ్వా/యుగాది
పశ్చిమ బెంగాల్ - నాభ భార్ష
రాజస్థాన్ లోని మార్వరి అనే తెగ వారు - తపన
పంజాబ్ - బైసాకి
తమిళనాడు - పుతాండు
మణిపురి - సజిబు నోంగమా పెంబ
సింధులోని సింధు తెగ వారు - చెటి చాంద్
అస్సాం - బిహూ
ఇండోనేషియా,బాలి లోని ' మురి తియూస్ ' అనే హిందూ తెగ వారు - నేపి
అనే పేరుతో ఉగాది జరుపుకుంటారు.

ఇక అత్యంత ప్రాముఖ్యం ఉగాది పచ్చడిది. ఉగాది పచ్చడిని 'కదంబ బజ్జి,'కదంబం,అని కూడా అంటారు. షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. షట్ ముఖాలకు ప్రతీకే ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ ఉగాది పచ్చడి.



పచ్చడి లో ఏమేం వాడతారు .. వాటి ఉద్దేశ్యం తెలుసుకుందాం..!

తొలిగా పుచే వేపపూత - చేదు - దిగులు, విచారం
తొలి చెరకు, బెల్లం - తీపి - ఆనందం , సంతోషం
తొలిగా పండించిన ఉప్పు - లవణం - భయం
పండించిన చింతపండు - పులుపు - చిరాకు
మిరియం ,కారం - కటువు - క్రోధం, ఆవేశం
తొలి మామిడికాయ - వగరు - ఆశ్చర్యం

ఇతరములు వారి వారి ఇష్టంతో లేక ప్రత్యామ్నాయంగా కలుపుకునేవి మాత్రమే..!

కొత్త ఆశ

// కొత్త ఆశ //
                                                       - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                                                            21.03.2015

నిజమే..!
మనిషి ఆశా జీవి..
ఆ ఆశే మాకు శ్వాసై
ముందుకు నడిపిస్తోంది..
ఎన్నికల వాగ్దాన రాజులపై ఆశ
కష్టాలు గట్టెక్కిస్తాడేమోనని,
కొలువైన రాజాధిరాజుల పై ఆశ
తోడుగా ధైర్యం ఇస్తారేమోనని,
పాలకులపై ఆశ..
ధరాభారం దించేస్తాడేమోనని,
కోటి దేవుళ్లపై ఆశ
కోరికల చిక్కుముళ్ళు విప్పుతారేమోనని,


ప్రతి ఏటా నీమీదా మాకెంతో అదే ఆశ..
కొత్త పుంతలు తొక్కిస్తావని
కొత్తగా చిగురిస్తావని..
కొత్త రాగాలు వినిపిస్తావని
కొత్త శ్వాస నింపుతావని..
కొత్త పచ్చదనపు సిరికురిపిస్తావని..
కొత్తగా మరేదో తెస్తావని..

ఎప్పటకప్పుడు అంతే ..!
మేం ఎదురుచూస్తూనే ఉంటాం..
 అవును..  మనిషి ఆశాజీవి మరి.!!

           

Sunday 15 March 2015

మనుశాస్త్రం వడ్డీ గురించి ఏంచెప్పింది??

వడ్డీ ఎంత తీసుకోవాలి?? మను ధర్మం ఏం చెప్పింది??
                                              - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                                                    03.03.2015





మనం రోజూ పేపర్లోనో , టీవీల్లోనో చూస్తూ ఉంటాం.. సూక్ష్మ వడ్డి ఋణం ధాటికి విలవిల.. అనో బ్యాంకుల్లో వడ్డీ రేటు తగ్గింపనో..పెరిగిందనో .. ఇలా అనేకం డబ్బు వడ్డీ రూపంలో చేతులు మారటం చూస్తూ ఉంటాం. మరి వేలకు వేలు వడ్డీ వసూలు చేయడం అన్యాయం అని గొంతుచించుకున్నా.. ఎవ్వరూ వినే పరిస్థితి లేదు. అధిక వడ్డీ ముక్కు పిండి వసూలు చేసి జేబులు నింపుకోవడం ఇప్పుడు వడ్డీ వ్యాపారుల ఏకైక లక్ష్యం.   మరి మన సంస్కృతి లో వడ్డీ గురించి ప్రామాణీకమేమైనా ఉందా..? ఉంటే ఏం చెప్తోంది..?


మన ధర్మ శాస్త్రాల్లో ప్రామాణికం మనుధర్మ శాస్త్రం.  భారత రాజ్యాంగానికి ఇతర దేశాల రాజ్యాంగాల తో పాటూ మను ధర్మ శాస్త్రం కూడా ఉపయోగపడిందనటంలో సందేహం లేదు. మరి మన పాలిట ధనువైన మనువు వడ్డీ గురించి ఏమి చెప్పారంటే..


వశిష్ఠ విహితాం వృద్ధిం సృజేద్విత్త వివర్జినీం
అశీతి భాగం గృహ్ణీయాన్మాసాద్వార్దుషిక: శతే!!




  ఋణం మీద అత్యధికంగా వడ్డి ఎంత తీసుకోవచ్చో ఈ  శ్లోకం చెబుతోంది.  అత్యధికంగా నూటికి 80 వ వంటు అంటే వంద రూపాయలకి రూపాయై పావలా మాత్రమే వడ్డీ అత్యధికంగా తీసుకోవాలని మనువు తన ధర్మ శాస్త్రంలొ సూచించాడు.

ఆహా..! ఎంత దూర దృష్టి.. కదూ.. మనవాళ్ళు ముందు ముండు ముక్కు పిండుతారని అప్పుడే ఊహించారు మహానుభావుడు.. నమోస్తు మనువు.. మా పాలిట ధనువు.

Monday 9 March 2015

ఏమని పొగడెదము నిను..??

// ఏమని పొగడెదము నిను..??//
                                              - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                                                       08.03.2015

మహిళా..! నిను పొగడగ మాతరమే..?
మహిన నిను తలచిన యదపొంగునే..!

బ్రిటీషు ముష్కరులనెదిరించిన ధీశాలి
తొలి రాజకీయ ఖైదీ మంగతాయారు వో
స్వతంత్ర్య భారతి సిగ మెరిసిన సరోజినీ సుమానివో
స్వేచ్చాభారతాన శాసనాధ్యక్ష విజయలక్ష్మి దరహాసానివో
ప్రతిభ చాటిన ప్రధమ ప్రమద ప్రతిభాపాటిల్ ఖ్యాతివో
ప్రధమ ప్రధానిగ వెలిగిన భారత రత్నం ఇందిరమ్మవో

మహిళా నిను పొగడగ మాతరమే..!
మహిన నిను తలచిన యదపొంగునే..!





ఐపిఎస్ కిరణానివి నీవని
డిజిపి కాంచనచంద్రం నీవని
అశోక చక్రధారి నీర్జభానోతు నీవని
ఆకాశాన రెక్కకట్టెగిరిన హరితాకౌరు నీవని
మురిసెనే ఈ అవని
అణువణువు నీదని

మహిళా నిను పొగడగ మాతరమే..!
మహిన నిను తలచిన యదపొంగునే..!

అందానికి పుట్టిల్లు ఈ నేలంటూ..!
చాటావు ప్రపంచాన సుందరి రీటాఫారియావై
ఎవరికన్న మేము తక్కువంటూ.
ఎవరెస్టు ఎక్కినావు బచ్చేంద్రపాలువై
స్పేష్ షిప్పులోన రోదసికేగిన కల్పనచావ్లావి నీవై
అంగ్ల చానెల్నీదిన ఆరతిషావై
టెన్నీసు సంచలనం సానియావి నీవై

ఎదిగేవమ్మా..ఇల మెరిసేవమ్మా!
నిను తలచి మామది మురిసేనమ్మా!

న్యాయశిఖ ఫాతీమాబీబీవి
రాయబారి ముత్తమ్మ బింబానివి
నోబెల్ థెరిస్సా సేవారూపానివి
బుకర్ నెగ్గిన అరుంధతీ(రాయ్)వి
ముఖ్యమంత్రిగ ఏలిన సుచేంద్రకృపలానీ

ఏమని పొగడము నిను కలువకంటి
చక్కనమ్మ, చక్కెరబొమ్మ
చారులోచన, తరళేక్షణ , ముదితా
లతాంగి, వలజ, సారసాక్షి,సుదతి,సుమతి
నమోస్తుతే   నెలత, నళినలోచని
కైమోడ్పిదే కోమలి , కిన్నెరకంఠి

ఓ...
మహిళా నిను పొగడగ మాతరమే..?
మహినా నిను తలచిన యదపొంగునే..!

           
             

మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో ...స్త్రీలలకు శతకోటి వందనాలు సమర్పిస్తూ , తొట్టతొలి  భారతీయ మహిళాశిరోమణుల నామాలతో కూర్చిన చిరు కవితాంజలి. -    - కరణం

Tuesday 3 March 2015

మూఢాచారాలా..?? ఎలా??-2..పిండం పెట్టడం ఎందుకు..??

మూఢాచారాలా..?? ఎలా?? 
           - కళ్యాణ్ కృష్ణ కుమార్. కరణం, చీరాల

2.  పిండం పెట్టడం ఎందుకు..??

 "యావత్ పిండ మనుష్యాని
గంగా తోయేషు తిష్టతి
తావద్ వర్ష సహస్రాణి
స్వర్గలోకే మహీయతే..!"

(ఎవరిని ఉద్దేసించి నీటిలో పిండ ప్రదానం జరుగుతుందో వారికి వేయి వత్సరాలు స్వర్గలోక ప్రాప్తి.)

ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళకీ హైందవం అంటే చిన్నచూపు.. వ్యంగ్య భావన ఎక్కువయ్యాయ్ . దానికి కారణమూ లేకపోలేదు..

1. ముందుతరం, తరువాత తరానికి అందించాల్సిన స్థాయిలో జ్ఞానం అందించక పోవటం..

2. జ్ఞానం అందించే స్థానంలో ఉన్నవారు, సంపూర్ణంగా చెప్పలేకపోవటం,

3. చెప్పగలిగేవారు సంపూర్ణంగా లేకపోవటం .

4. అసలేమిటీ ఇందులో మర్మం అని తెలుసుకునే ప్రయత్నం చేసేవారు మృగ్యమవడం.

5. ఎవరేది అంటే అది నిజమే అన్నట్లు తలూపడం, నిజమని భ్రమలోకి జారుకోవటం.

 6. అర్ధమయ్యే రీతిలో చెప్పినా అర్ధం చేసుకోలేని అజ్ఞానంలో ఉండటం
7. సంస్కృతం , ప్రాకృతం వంటి బాషలు కనుమరుగవడం.

8. జాతి నాశనానికి కొందరు పాలకులు చేసిన కుట్రలో భాగంగా సంస్కృతి, సంస్కృతం మూలాలు నాశనమొనరించడం.

9. హేతు వాద తత్వం.. ఇతర మతాల సంస్కృతి దాడులు.. మొదలైనవి ఎన్నో వున్నాయ్. వాటి గురించి  ఆలోచిస్తుంటే అనంతాలేమో అనిపిస్తుంది.

కాయలున్న చెట్టుకే రాళ్ళు :

.. కాయలున్న చెట్టుకే దెబ్బలు .. కదా..! ఎన్నో ఫలాలిచ్చే హైందవ చెట్టుకే  రాళ్ల దెబ్బలు.. హేతు బద్దంగా సమీక్షిస్తే హైందవం మొత్తం సైన్స్ నిండి ఉండన్న సత్యం.. నాస్తిక శిఖామణులకి, హేతువాదులకి, ఇతర మతస్తులకీ మింగుడు పడని నిజం.

  అరే  విదేశీయులు గుర్తిస్తున్నార్రా..! అని మొత్తుకున్నా.. ఇక్కడ పుట్టిన కొందరు మూర్ఖులకు చెవికెక్కదు. అందుకేనేమో "మొండివాడు రాజుకన్న బలవంతుడ"న్నారు పెద్దలు.

ఇక అసలు విషయానికి వద్దాం.. పిండం పెట్టడం అనవసరమా..? (ఇటీ వల ఒక చిత్రం లో ఒకానొక సందర్భంలో వేసిన ప్రశ్న ఇది.)

    కొందరు ప్రబుద్దులు.. వారి సూక్ష్మ బుద్ధికి పదును పెట్టి వేసిన ప్రశ్న.. ఇది.. ఇప్పుడు నాస్తిక, హేతువాద,  పరమతస్థులకు ఒక సాకుగా దొరికింది..

ప్రశ్న : " పిండం అంటూ నీళ్లలో వేసే అన్నం ముద్ద మరొక పేదవాడికి  కడుపు నింపుతుంది  కదా..?"

"శెభాష్.. నిజమే" అనిపిస్తోంది కదూ..??

మరి ఆ అభిప్రాయం నిజమా? అంటే,  ఆ భావన 100శాతం తప్పు .!

మరి ఎందుకో తెలుసుకోవాల్సిన బాధ్యత మనమీదుందని గుర్తించాలి. అందుకే ఎందుకో ఇప్పుడు తెలుసుకే ప్రయత్నం చేద్దాం.

     

పిండం  : ఇవి పలు రకాలు.. కర్మకాండలకు , రకరకాల పిండాలు పెట్టడం హిందూ సంస్కృతిలో ఉంది.. కొందరు మాత్రమే పాటిస్తున్నారు.. కొందరు రాను రాను విసర్జించి ఉంటారు. కొందరు తొలినాళ్ళ నుంచి పాటించి ఉండక పోవచ్చు.

ఈ ప్రశ్న కు సమాధానం చూసే ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

విశ్వంలో మనిషి మాత్రమే ఉన్నాడా??  ప్రాణంతో ఉన్న ఇతర జాతులేమీ లేవా?

మీరనే సైన్సే ఏమి చెబుతోందో తెలుసా..!??
     
8.7 మిలియన్ల జీవరాశులు భూమిమీద జీవిస్తున్నాయని సైన్స్ పత్రిక చెబుతోంది. ఇంకా కూడా ఎక్కువే ఉండొచ్చుకూడా.

ఇక భారతదేశం కి వస్తే అవి కూడా ఖచ్చితంగా లక్షల సంఖ్యల్లోనే ఉంటాయి.

       అందరికన్న మేథస్సున్న మానవుడు మూఢాచారాలు నమ్మొచ్చా?  అనే వాదం ఉన్నవారికి,  మరి ఆయా ఇతర  జీవులు ఎలా జీవిస్తాయో అన్న అనుమానం ఎందుకు కలుగట్లేదో అర్ధం కాని ప్రశ్న.

మన కడుపుకి తింటే చాలా..??

    ఒక గిరి గీసుకుని అందులో మఠం వేసుకు కూర్చుని, ఎదుటి వారిమీద దుమ్మెత్తి పోయటం చాలా సులభమే..! కానీ గతించిన మంచోళ్ళు అలా చేయలేదు.. పూర్వీకులు అన్నింటి గురించీ పట్టించుకున్నారు. అన్ని ప్రాణుల అవసరాలనీ ఏదో ఒక రూపంలో తీర్చాలన్న నీతి ని ప్రభోదించారు..

అందులో భాగమే ఈ పిండ ప్రదానం,తర్పణం అనే కార్యక్రమం లేదా క్రతువు.

ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు కాలం చేసినప్పుడు పిండం పెట్టడం ఆచారం..

  శాస్త్రంలో మంత్ర విధానంగా  ..
"ఇదం పిండంగృధ్ర వాయస, జలచర ముఖేన ప్రేత భుజ్యతాం"
(గద్దలు, కాకులు, జలచరాలు రూపంలో  పిత్రుదేవతలకు ఆహారం అందించాలి)

1. కాలం చేసిన వారి పేరుతో , వారిని గుర్తుంచుకోవాలనే ఉద్దేశ్యంతో (ఆత్మ శాంతి కోసం) ఊరి జనం మొత్త్తాన్ని పిలిచి స్థోమతకు తగ్గట్టు అన్నదానం చేస్తారు. ఇది బ్రాహ్మణ , బ్రాహ్మణేతరులకు కూడా అన్నదానం జరుగుతుంది. కాబట్టి మనుష్య జాతికి భోజనం పెట్టారు ఆ కుటుంబం వాళ్ళూ.

2. వాయస పిండం (కాకి కి పిండం) :
       "కాకులు దూరని కారడవి అంటారు." ఈ ఉపమానం ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. అంటే కాకి ఎక్కువగా కనిపించే పక్షి జాతి కి చెందిన జీవి. (క్రతువు ఎప్పుడు, ఎక్కడ,మాసికమా, ఏడూడా అనేది మాత్రం ఇక్కడి సమస్యకాదని పురహితులు గుర్తించాలి.) ఆ పక్షిజాతికి భోజనం పెట్టడం అనేది అందులో పరమార్ధం .
నువ్వులు, అన్నం,నెయ్యి కలిపిన ముద్ద పెడతారు.
అంతే ఇక్కడ కాకి తినే పదార్ధాలనే ఉపయోగిస్తారనేది గ్రహించాలి.

3. వికిర పిండం /నీటిలో వదిలే పిండం:  ఇక ఈ పాటికే మీకు సమస్యకు సమాధానం  అర్ధం అయి ఉంటుందనుకుంటున్నా..! కానీ మన హేతువాద సోదరులకి హేతుబద్ధంగా చెప్పాలనేదే ఈ ప్రయత్నం.!
   నీటిలో అనేక జీవజాతులున్నయ్. మనిషి కన్న ముందు పుట్టిన మత్స్యజాతి  ఉంటుంది. ఆ చేపలకు ఆహారమే నీటి లో వదిలే పిండం.

    మనిషికి , పక్షిజాతికి, జలచరాలకీ కూడా ఆహారం అందిస్తున్నారు.. అది కూడా చనిపోయిన వారి పేరు మీద.. అది ప్రేతం అన్నాగానీ, ఆత్మ శాంతి అన్నా గానీ, ఆయా పేర్లు , ఆయా కాలమాన పరిస్థితుల బట్టి పెట్టుకోనే అవకాశం ఉంది. అవసరార్ధం మార్చే చాన్స్ వెయ్యి శాతం ఉంది.

4.  ఇక గోవుకు పెట్టే పిండం.  సరే మనిషికి పెట్టారు, పక్షియైన కాకికి పెట్టారు. జలచరాలైన చేపలకి పెట్టారు,అదేరీతిలో జంతువైన  ఆవుకి పెట్టారు. అది కూడా ఆవుకి బలిష్టమైన ఆహారం మాత్రమే అనేది తెలుసుకోవాల్సిన విషయం.

  ఈ మధ్య  గో సేవా అంటూ గోవుల్ని ఆదుకుంటున్నాం అని చెబుతున్నవారు,  పిండాన్ని గోవులకి పెట్టనీయటం లేదనే విమర్శ కూడా ఉండి. అది చాలా తప్పు.. అపోహ కూడా.! ఆవుకి బలమైన ఆహారం అందించడమే పిండ ప్రదానంలోని గుణం.
(శాస్త్రం ప్రకారం కర్మకాండలో గోవుకు పిండ ప్రదానం నిషిద్దం కూడా.)

 ఇక పెడవాదులు వేసే మరో ప్రశ్న.. జంతువంటే గోవు మాత్రమేనా? ఇంకేం లేవా..? కుక్కకో పిల్లికో పెట్టొచ్చుకదా? కాకికే పెట్టాలా పిచ్చుకకో పిట్టకో పెట్టొచ్చు కదా..?

కావాలని ..అడగాలని అడిగే ప్రశ్నలకీ కూడా సమాధానాలు ఉంటాయ్. !!

    ఆవు ఎన్నో ఔషద గుణాలున్న మేలు జాతి పశువని గుర్తించారోయ్ మన పూర్వీకులు. అంతే కాదు ప్రతి ఇంటిలో కుక్క ఉన్నా, లేకున్నా ఆవు మాత్రం ఉండేది. అందుకే ఆ కాలం వారు సుభిక్షంగా ఉన్నారనడంలో సందేహం లేదు.  అన్నీ ఇళ్ళల్లో ఆవులుంటాయి కాబట్టి, వాటికి కూడా భోజనం పెట్టడమే ముఖ్యోద్దేశ్యం.  కాకికే కాదు గ్రద్దకూ పెట్టొచ్చని మంత్రం చెబుతోంది.
ఇందులో కూద మరొక గొప్ప మర్మం ఉంది కూడా.. ఎక్కడైతే కాకులు, లేదా గ్రద్దలు తిరుగు తుంటాయో.. అక్కడ విష జంతువులైన పాముల వంటి జీవులు సంచరించక పోవడం కూడా గమనించాలి.
ఇక ..
   ఆవులకు పెట్టె పిండాలలో పాలు పాల పదార్ధాలైనవి (నెయ్యి వంటీవి) కలవవు.     అలాగే చేపలకి పెట్టే పిండంలో మినుములు  ఉండవు.
    కాకులకి అంటే వాయసాలకి పెట్టే పిండంలో నెయ్యి,నువ్వులు ఉంటాయి. అవి బలమైన ఆహారం వాటికి.  అలా ప్రతిదీ ఆచి తూచి ప్రయోగాత్మకంగా విజయం సాధించి మాత్రమే చేశారు.

       కానీ అంతటీ గొప్ప సంస్కారవంతమైన గొప్ప ఆచారాన్ని కొనసాగించడానికి ఏదో ఒక పద్దతి వాడాలి కనుక.. అలా ఆదేశించారు. అందుకే ఇంతకాలం ఆ ఆచారాలు కొనసాగుతున్నాయ్.. ఈ రోజు ఏ చట్టం చేసినా వెంటనే తుంగలో తొక్కేస్తున్నారు..  ఆ దుస్థితి ఎందుకు దాపురించిందో   మన హేతు మేథావులు చెప్పాల్సిందే..!

  కొన్ని  మంచి విషయాలు పాటించడానికి  "భక్తి" అని చెప్పేరు. కొన్ని విషయాలను "ముక్తి " అని చెప్పారు.. అంతే..!
       మనం ఏ కళ్ళతో చూడాలో అవేకళ్ళు పెట్టుకు చూడాలి. దృష్టి లోపం లేనోడు  చత్వారం కళ్ళజోడు వాడితే నొప్పి ఖాయం.
      అలాగే హేతుబద్దంగా ఉన్న వాటిని జనవిజ్ఞానులు ఎందుకు చెప్పటం లేదో అర్ధం కావడం లేదు.
     వారు కేవలం వారికి తెలిసి గిరి గీసుకుని అదే ప్రపంచం అనే అపోహలో కొట్టు మిట్టాడుతున్నారో..  లేక  కేవలం హిందువుల సంస్కృతి సంప్రదాయాల మీద జరుగుతున్న దాడులో అర్ధం కాకుండా వుంది. మరి  దొంగ బాబాల తప్పులను ఎత్తి చూపిన జన మేథావులకి .. హైందవంలో మంచి కూడా ఉందన్న విజ్ఞానాన్ని ఎందుకు బోధించడంలేదో వెయ్యిడాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

జనులారా..! తస్మాత్ జాగ్రత్త..!!  జాతి నాశనానికి వీరే హేతువులు.

ఆఖరుగా మరొక్క విషయం.. ఏ ఒక్క ముద్దతోనో పేదవాడి కడుపు నిండదు. అది మన దగ్గర ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తూ పేదలను పోషిస్తున్నాం అని డప్పాలు పోయే ప్రభుత్వాలదని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వాలు 60 ఏళ్ళుగా ఏం ఉద్దరిస్తున్నాయో  నిలదీయాలి.

కొద్ది సేపటి క్రితం ఒకరు అడిగారు.. మరి ఒక్క పిండం గురించి ఇంత క్లాస్ చెప్పేరు కదా.. మరి వేల మంది పిండాలు పెడితే చాలా భోజనం వృధా కదా.. అని..!

" ఇంత చెప్పాక కూడా వక్ర బుద్ధి మారని వారి ని ఏమీ చేయలేము.. అందుకే వారికి నానుంచి  చిన్న ప్రశ్న.. అసలు మనం తింది మానేసి వారికే పెడితే దేశంలో పేద బలహీనులు వుండరు కదా?? అసలు మనం ఎందుకు తినాలి..?? వెంతనే మీరంతా తిండి మానేసి వారిని పేదల్ని పోషించండి.. ప్రభుత్వాలు మాత్రం దోచుకుని ఏళ్ళు పరిపాలిస్తాయ్.
                   
                             - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                               28.02.2015

మూఢాచారాలా..?? ఎలా?? - 1. ముండమోపి ఎదురైతే ఏంజరుగుతుంది...??

మూఢాచారాలా..?? ఎలా?? - 1
              - కళ్యాణ్ కృష్ణ కుమార్. కరణం, చీరాల

1. ముండమోపి ఎదురైతే ఏంజరుగుతుంది...??



                ఈ మధ్య సినిమాల్లో  ఒక కొత్త పోకడ మొదలైంది..   ఒకరి .. వెనుక ఒకరన్నట్లు.. దగ్గర దగ్గర ఒకే కథను అటు తిప్పి ఇటు తిప్పి తలోకటి చూపిస్తున్న్నరు.. హిందీ చిత్రాలు, తెలుగు, తమిళ చిత్రాలు.. ఒకటి కాదు అన్నీ భాషల్లో ఇదే లేటెస్ట్ ట్రెండ్.. స్వాముల్ని అడ్డం పెట్టూకుని ఒక మతాన్ని టార్గెట్ అవ్వచ్చు కాకపోవచ్చు కానీ మధ్య మధ్యలో ఒక డైలాగ్ ఇతర మతాల గురించి కూదా ఉండేలా జాగ్రత్త పడ్డారు కానీ..

ఇక్కడ మన చర్చనీయాంశమేమంటే.. వాళ్ళు ఏవి చూపిస్తున్నా.. వారడిగే వాటికి సమాధానం లేదా..? మన అనుకునే సంస్కృతికి విఘాతం జరుగుతున్నప్పుడు మనం అన్న మారాలి.. సమాధానం అన్న చెప్పి తీరాలి .. ఆవిధంగా ప్రయత్నంచాలన్నదే ఈ టపా ఉద్దేశ్యం.

 ఈ మధ్య ఓ చిత్రం చూశా..! మూఢాచారాలు మూఢ నమ్మకాలు అంటూ... సాగిందా చిత్రం.. ఆ తర్వాత దేవుడిని తెచ్చి ఏదో చెప్పించే ప్రయత్నం చేసినా  ఆ రచయిత ప్రశ్నలకు సమాధానం  ఇక్కడ ముఖ్యం..   అనవసరంగా కాలం మారినా వస్తున్న ఆచారాలైతే మానాల్సిందే..! మరి


సరే నేనే ఓ ప్రశ్న వేస్తున్నా??

ముండమోపి ఎదురైతే.. వచ్చిన నష్టమేంటి..??

ప్రశ్న రెండో సారి.. ముండమోపి ఎదురొస్తే ఏమౌతుంది...                                                            


ఇది మూఢాచారమా..! ఆచారమా??

నేను ఆనాటి మంచి ఆచారం అంటాను.

మనం అర్ధం చేసుకోవడంలో, పెడత్రోవ వల్ల కలిగిన నష్టం  నాస్తికుల చేతికి వరమైంది...

హిందూ ధర్మ సిద్దాంతాల్లో ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి .. పదుగురు ఆమోదించిన వాటినే  ...ఆచారాలుగా వ్యవహరించబడ్డాయని నేను నమ్ముతాను..  (ఆనాటి చట్టాలకు లోబడి కొన్ని ఉండొచ్చు .. అలాంటివి రూపుమాపాలి..నేటి చట్టాలకు లోబడి .. పరిస్థితులకు లోబడి మారాల్సి ఉంది.. దీనిలో ఏమాత్రం డిస్కషన్స్ లేవు )

 కానీ అన్నీ మూఢాచారాలు కావు.. వాటికి అప్పటి కాల మాన పరిస్థితులు.. మాత్రమే కారణం.

సరే ప్రశ్న మరోసారి క్షుణ్ణంగా పరిశీలీంచండి

"ముండమోపి ఎదురొస్తే నష్టం ఏంటి..?"
ఇదిగో అదే ప్రశ్న మరలా ఇక్కడే జాగ్రత్త...

" ముండమోపికి మనం ఎందుకు ఎదురెళ్ళకూడదు.?" ఇదీ వెయ్యల్సిన ప్రశ్న..

"అవును.. ఆ మహా తల్లికి మనం అనే వెధవలం ఎదురెళ్ళకూడదు కానీ.. ఆమె మనకి ఎదురు రావచ్చు.. ఇదీ నా సమాధానం.."

కారణం కుడా చెప్పాలి కదా.. ఇదిగో చెబుతున్నా..."

1.ఇదివరలో మన సంస్కృతి ప్రకారం స్త్రీకి చిన్ననాటే వివాహం చేసేవారు..

2. స్త్రీ భర్త వయసు రీత్యా చాలా పెద్దవారు అయ్యే అవకాశమే అధికం.

3. సదరు భర్త చనిపోయినప్పుడు ఆమెకు శిరోముడనం చేసి తెల్ల చీరెకట్టే వారు.. భర్త పోయిందన్న విషయానికి గుర్తయి ఉండొచ్చు.( ఈ ఆచారం ఇప్పుడు లేదు.. మంచి పరిణామం)

4. సదరు స్త్రీ చిన్న వయస్సులోనే భర్త ను పోగొకుని పుట్టెడు దుఖం తో ఉండి భర్త కోసం సాధ్విలా తపిస్తూ.. నిత్యం రోదిస్తున్న సమయంలో ఒక అందమైన జంట.. మరింత అందం గ ముస్తాబై  ఆమె కి ఎదురొస్తే..
5.అమెకి తన కొద్ది రోజుల క్రితమే వివాహమై తన్ జీవిత భాగస్వామి గుర్తొస్తే..
6. ఆమె మనసు మరింత క్షోభిస్తుందనేది ఎవ్వరైనా ఇట్టే చెప్పొచ్చు. అవునా కదా..?

    అందుకే ఆమెకి మనం ఎదురెళ్ళకూడదన్నరు కానీ.. ఆమె రావటం వల్ల మనకే ప్రమాదమూ లేదని గుర్తుంచుకోండి..
మనం చేసే పిచ్చి చేష్టలకి .. తెలియని తనానికి మన పూర్వీకులుచెప్పిన జాగ్రత్తలు అనవసరంగా ప్రక్కదోవపట్టడం వల్ల అంతటి మహానుభావులకి చెడ్డపేరు తేవడం తప్ప వేరొకటి కాదు.. దయచేసి  ఇలాంటి చక్కటి హైందవా ఆచారాల అసలు విషయాల గుట్టు  విప్పే  ప్రయత్నంలో మీరూ భాగస్వాములు కండి.. మీ ఆలోచనలను నాతో పంచుకోండి.. మీ కేదన్నా ఆచారవ్యవహారాల మీద ఇలాంటి దృష్టికోణం ఉంటే తెలియచేయండి.. నాకు పర్సనల్ గా ఐనా మెసేజ్ చెయ్యండి. మరి కొన్నిటి పై త్వరలో చర్చిద్దాం.

                                             -          మీ కళ్యాణ్ కృష్ణ కుమార్. కరణం, చీరాల
                                                                                                20.01.2015

                   
https://www.youtube.com/watch?v=BCknHCgKmTg